Jishnu Dev Varma
Jishnu Dev Varma: లోక్సభ ఎన్నికల సమయంలో తెలంగాణ గవర్నర్గా మూడేళ్లు పనిచేసిన తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర్యరాజన్ రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె గవర్నర్ పదవి వదులుకున్నారు. ఎన్నికల్లో పోటీచేసినా విజయం సాధించలేదు. ఇక తమిళిసై రాజీనామాతో కేంద్రం జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణను ఇన్చార్జి గవర్నర్గా నియమించింది. మూడు నెలలపాటు ఆయన తెలంగాణ గరవ్నర్గా పనిచేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను శనివారం(జూలై 27) రాత్రి నియమించారు తెలంగాణకు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, రాజవంశానికి చెందిన జిష్ణుదేవ్ వర్మను నియమించారు. జూలై 31న ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే కొత్త గరవ్నర్ నియామకంపై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ కొత్తగవర్నర్ నియామకం వెనుక సీఎం రేవంత్రెడ్డి చక్రం తిప్పినట్లు రాజకీయ, మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ చర్చకు బలం చేకూర్చేలా గవర్నర్గా ఎంపికైన జిష్ణుదేవ్ వర్మ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను గవర్నర్గా ఎంపికైన విషయం ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఫోన్ చేసి చెప్పే వరకు తెలియదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. గవర్నర్లను కేంద్రం సిఫారసు చేస్తుంది. మొదట తెలిస్తే తెలంగాణ బీజేపీ నేతలకు తెలియాలి. కానీ, రేవంత్రెడ్డికి తెలయడం, ఆయన ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో కాంగ్రెస్..
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక రాష్ట్రంలో ఆరు నెలల క్రితం కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణకు పూర్తి గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను నియమించడం, ఆవిషయం మొదట తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి తెలియడంపైనే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత.. గవర్నర్లను ప్రధాని మోదీ సిఫారసు చేశారు. ఈమేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. నియామకం గురించి తెలిస్తే మొదట తెలంగాణ బీజేపీ నేతలకు సమాచారం అందాలి. త్రిపుర గవర్నర్గా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డికి తెలియాలి. కానీ అందరికంటే ముందు రేవంత్ కు ఎలా తెలిసింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీలో బీజేపీ పద్దెలతో రేవంత్రెడ్డి సత్సంబంధాలు ఏర్పర్చుకున్నారా అన్న చర్చ జరుగుతోంది.
రాజవంశీయుడు..
ఇదిలా ఉంటే.. జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజవంశీయుడు. మొదట కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2018లో త్రిపురలోని చరిలం శాసనసభ స్థానం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల ఎన్నికల్లో అదే శాసనసభ స్థానం నుంచి త్రిపుర మొహత పార్టీ అభ్యర్థి సుబోద్ దేబ్ బర్మ చేతిలో ఓడిపోయారు. తాజాగా తెలంగాణ గరవ్నర్గా నియమితుయ్యారు.
మొట్టమొదటి వ్యక్తి..
గవర్నర్ల నియామకంలో కేంద్ర ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవు. గతంలో పనిచేసిన యూపీయే, ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా ఉత్తర, దక్షిణ భారత దేశ రాష్ట్రాల నేతలనే ఎక్కువగా గవర్నర్లుగా నియమించాయి. కానీ, ప్రధాని మోదీ తొలిసారి ఈశాన్య రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత జిష్ణు దేవ్ వర్మకు అవకాశం కల్పించారు. త్రిపుర నుంచి గవర్నర్గా నియమితులైన మొదటి వ్యక్తి ఇతనే.