Telangana : కేటీఆర్, హరీష్ విసురుతున్న “ఉప” సవాల్ కు రేవంత్ సిద్దమే.. తాజా నివేదికలు ఏం చెబుతున్నాయంటే..

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఓవైపు వర్షాలు తగ్గినప్పటికీ.. నాయకులు విసురుకుంటున్న సవాళ్లు, ప్రతి సవాళ్ళతో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 11, 2024 6:25 pm

KTR-Revanth Reddy

Follow us on

Telangana :  2023 సంవత్సరం చివరి నెలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అప్పటి అధికార భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షానికి పరిమితం అయిపోయింది. అయితే భారత రాష్ట్ర సమితి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో స్టేషన్ ఘన్ పూర్, ఖైరతాబాద్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఉన్నారు. అయితే వీరిపై అనర్హత వేటు విధించాలని భారత రాష్ట్ర సమితి హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఫలితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. అంతేకాదు ఆయన ముందు ఉన్న ప్రత్యామ్నాయాలపై కసరత్తు మొదలుపెట్టారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే.. వాటికి సిద్ధం కావాలని నిర్ణయించారు. ఇప్పటికే పను నివేదికలను అధ్యయనం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరొక విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది..

ప్రధాన చర్చ

కోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. భారత రాష్ట్రసంతి నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధించాలని భారత రాష్ట్ర సమితి స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అనంతరం హైకోర్టు తలుపు తట్టింది. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ నిర్ణయం కీలకంగా మారింది. ఇక మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే..

ఒకవేళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లేదా అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానం వరకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే అక్కడ ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అరవైపు 16 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే రాజకీయంగా రేవంత్ భారత రాష్ట్ర సమితిపై అప్పర్ హ్యాండ్ సాధించినట్లవుతుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ స్థాయిలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేర్తారనేది? ఒకింత సందేహమే. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే.. వాటికి ఎలా సన్నద్ధం కావాలనే దానిపై కాంగ్రెస్ పార్టీలో లోతుగా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది.

ఏడాది పూర్తి కాకుండానే..

ఏడాది పూర్తి కాకుండానే ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజల స్పందన.. రాజకీయంగా పార్టీకి ఉన్న బలాలను రేవంత్ రెడ్డి పలు నివేదికల ద్వారా తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఉప ఎన్నికలు నిర్వహించడం ఖాయం అయితే పదిమంది ఎమ్మెల్యేల్లో కొంతమంది భారత రాష్ట్ర సమితికి తిరిగి వెళ్లే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఇప్పటికే ఎన్నికల హామీలు పూర్తి చేయకపోయినప్పటికీ.. చేస్తున్న వాటితో ప్రజల్లో సానుకూల దృక్పధం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే క్షేత్రస్థాయిలో ప్రతికూల ఫలితాలు వస్తాయనే ఆందోళన కూడా ఆ పార్టీ నేతలలో కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత.. హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకు సాగుతారు? ఉప ఎన్నికలు వస్తే ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తారు? అనే విషయాలపై ఒక స్పష్టత వస్తుందని కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు చెబుతున్నారు.