Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన మోశారు. కేసులు ఎదుర్కొన్నారు. నిర్బంధాలను తట్టుకున్నారు. ప్రతి విషయంలోనూ ఇబ్బందులు పడ్డారు. చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని పంతం పట్టారు. తెలంగాణ వచ్చినంకనే వివాహం చేసుకున్నారు. ఇలా తన అణువణువు తెలంగాణ వాదాన్ని నింపుకొని.. చివరికి తెలంగాణ వాదిగానే కన్నుమూశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యేగా.. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా.. ఆయన ఎన్నో విశేషమైన సేవలు అందించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణకు.. బలోపేతానికి ఆయన విశేషమైన కృషి చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి కెసిఆర్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరుపొందారు. కెసిఆర్ వరంగల్ వచ్చినప్పుడు.. సుదర్శన్ రెడ్డి ఆయన వెంట ఉండేవారు. పెద్ది అని ప్రేమగా కేసీఆర్ సుదర్శన్ రెడ్డిని పిలిచేవారు. సుదర్శన్ రెడ్డి ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టలేదు. గులాబీ జెండాను విడిచిపెట్టలేదు. 2018 ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 2023 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఆయనప్పటికీ నియోజకవర్గాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ప్రజల సమస్యల మీద ఆయన నిత్యం పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
సుదర్శన్ రెడ్డి నివాసం హనుమకొండలో ఉంది. ఆదివారం ఆయనకు విపరీతంగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హనుమకొండ వెళ్లిపోయారు. సుదర్శన్ రెడ్డి 1974 సంవత్సరం ఆగస్టు 6న రాజిరెడ్డి.. అమృతమ్మ దంపతులకు జన్మించారు. ఈయనది నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి స్వగ్రామం. 1991లో వరంగల్లోని మహబూబియా కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఈయన భార్య పేరు స్వప్న. ఇతనికి నిదర్శన్ రెడ్డి.. ధర్మిష్టారెడ్డి అనే పిల్లలు ఉన్నారు.
మొదట్లో ఈయన తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభించారు. 2001లో భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆ తర్వాత నల్లబెల్లి మండలానికి జడ్పిటిసిగా రైతు నాగలి గుర్తు మీద పోటీ చేసి గెలిచారు 2004లో భారత రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కన్వీనర్ గా, 2005లో పార్టీ కార్యదర్శిగా.. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎనిమిది సంవత్సరాలపాటు పనిచేశారు. 2006 నుంచి 2014 వరకు భారత రాష్ట్ర సమితి పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. కెసిఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా పేరుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. 2018 లో విజయం సాధించారు.




