Owaisi College Controversy: అంతా సక్రమమే. అక్రమం లేదు.. చెరువులు ఆక్రమించలేదు. చెరువులే ఏకంగా ఓవైసీ కాలేజీలకు వెళ్లాయి. ఇదీ తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ కాలేజీలకు ఇచ్చిన క్లియరెన్స్.. చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడ ఖల్సా ప్రాంతంలో సల్కం చెరువు బఫర్ జోన్ ప్రాంతంలో నిర్మించిన బారిష్టర్ ఫాతిమా ఓవేసి ఎడ్యుకేషన్ క్యాంపస్ పై కొంతకాలంగా వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. హైడ్రా ఈ కాలేజీ ని పడగొట్టాలని.. సల్కం చెరువు పరిధిలో ఉన్న ఓవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కొద్ది రోజులుగా బిజెపి నాయకులు.. భారత రాష్ట్ర సమితి నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పేదల విషయంలో దూకుడుగా పని చేసే హైడ్రా.. ఓవైసీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు ఒక కీలక సమాచారాన్ని ఇచ్చారు. సల్కం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఎటువంటి అనధికారిక నిర్మాణాలు లేవని.. గతంలో మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేసినప్పుడు.. ఈ చెరువు చుట్టూ రింగ్ బండ్ కూడా నిర్మించామని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వం ఈ ప్రకటన చేయడంతో హైకోర్టు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ వాదనలో అస్పష్టత ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. జల వనరులను కాపాడటం.. ఎఫ్ టి ఎల్ పరిధులను నిర్ణయించడం ప్రభుత్వ బాధ్యత అని.. అలాంటప్పుడు జిల్లా కలెక్టర్ ఇంతవరకు తుది నివేదిక ఎందుకు ఇవ్వలేదని.. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వెబ్సైట్లో మ్యాప్ ఎందుకు అప్లోడ్ చేయలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఈ కాలేజీని నడిపిస్తున్నారు. అయితే ఈ విద్యాసంస్థకు చెందిన భవనాన్ని కూల్చి వేయడానికి కొద్దిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ భవనం కూల్చివేత పై హైకోర్టు తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటిని ఉపసంహరించుకుంది.. ఈ అంశం మీద వేరువేరు బెంచ్ లు సమాంతరంగా విచారణ సాగించడంతో.. విరుద్ధమైన తీర్పులు వస్తాయని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన కూల్చివేతలను సాలార్ ట్రస్ట్ సవాల్ చేసింది.. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సల్కం చెరువు ఆక్రమణలపై ప్రధాన పిల్ కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో.. దానికి అనుబంధంగా దీనిని జత చేయాలని రిజిస్ట్రీ ఆదేశాలు జారీ చేయడం విశేషం.
హైకోర్టు ఇచ్చిన తీర్పులో మరొక కీలకమైన అంశం ఎక్కడ తెలుగులోకి వచ్చింది.. చెరువులను రక్షించే అధికారం హైడ్రాకు పూర్తిస్థాయిలో ఉన్నప్పుడు.. కొన్ని చెరువులను మాత్రమే ఎందుకు గుర్తిస్తున్నారని.. మిగతా వాటిని ఎందుకు పట్టించుకోవడంలేదని హైడ్రాను ప్రశ్నించింది. హైడ్రా యంత్రాంగం రాజకీయ నేతల ఒత్తిడికి తలవంచడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనే సంకేతాలు ప్రజలలోకి వెళ్తున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఓవైసీ కాలేజీ విషయంలో విద్యాశాఖ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
2017లో సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒక సెటిల్మెంట్ డీడ్ ద్వారా ఈ భూమి మీద ఆకులు పొందామని చెబుతోంది. అలాంటప్పుడు ఈ ట్రస్ట్ 2016 లోనే భవన క్రమబద్ధీకరణ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకుందని హైకోర్టు ముందు పిటిషనర్ విజయ్ గోపాల్ సరికొత్త ప్రశ్న అందించారు. భూకబ్జా కోణం ఉందని.. సిబిఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ సాగించాలని ఆయన కోరారు. ఈ కేసు విచారణలో ఈనెల 30 కి కోర్టు వాయిదా వేసింది. ఈ కాలేజీ ని ఎఫ్ టి ఎల్ పరిధిలోని లేదని ప్రభుత్వం చెప్పడం.. కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాలు తదుపరి దశలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
