Site icon OkTelugu

మీ ఆస్తులు ఇక భద్రం: ఓనర్‌‌ లేకున్నా ఇంటికొచ్చి నమోదు చేస్తారు

telangana land survey

telangana land survey

telangana land surveyతెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆస్తుల నమోదు ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో ఆఫీసర్లు ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం తాజాగా నాన్‌ అగ్రికల్చర్‌‌ ప్రాపర్టీస్‌ అప్‌డేషన్‌ (న్యాప్‌) పేరిట కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతీ ఆఫీసర్‌‌ ఇంటి నిర్మాణాల వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

Also Read: సీఎం కేసీఆర్ మనవడికి ఏమైంది?

ఇంటి వివరాలతోపాటు యజమాని కులం, నిర్మాణ వినియోగం, ఆస్తి సంక్రమించిన విధానంతోపాటు విద్యుత్‌, నీటి బిల్లుల సమాచారం సహా మొత్తం 52 అంశాలను సేకరిస్తారు. ప్రతి ఆస్తికి కూడా ఆధార్‌‌ సంఖ్యను యాడ్‌ చేస్తారు. రాష్ట్రంలోని హైదరాబాద్‌ సహా ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా అక్టోబర్‌‌ 12 లోపు పీటీఐఎన్‌ (ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌‌) ఉన్న అన్ని ఆస్తుల వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సర్వే టైంలో యజమాని తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ‘యజమాని అందుబాటులో లేకుంటే కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తీసుకుంటాం. కిరాయిదారులుంటే వారి నుంచి యజమాని ఫోన్‌ నంబర్ తీసుకొని అవసరమైన సమాచారం సేకరిస్తాం. ఫోన్‌లోనూ అందుబాటులోకి రాకుంటే మున్ముందు ప్రత్యేక ఓ వెబ్ లింకును అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా ఆస్తుల వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. దీనిపై పూర్తిగా స్పష్టత రాలేదు. సర్వే జరుగుతున్న క్రమంలో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా నిర్ణయం ఉండోచ్చ’ అని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

Also Read: కట్‌ చేసిన జీతాలు నాలుగు వాయిదాల్లో చెల్లింపులు

మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో వివరాల సేకరణకు పర్యవేక్షకులను నియమించారు. గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని నిర్మాణాలను నమోదు చేస్తారు. నాన్‌ అగ్రికల్చరల్‌ ప్రాపర్టీస్‌ అప్‌డేషన్‌ యాప్‌ పంచాయతీ కార్యదర్శులకూ అందుబాటులోకి వచ్చింది. ప్రతి పంచాయతీ కార్యదర్శి రోజుకు 70 నిర్మాణాలను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సర్వే ఇప్పటికే ప్రారంభించనప్పటికీ అక్కడక్కడా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కోసారి సర్వర్‌‌ డౌన్‌ అవుతుండడంతో ఇబ్బందులు వస్తున్నాయని కార్యదర్శులు వాపోతున్నారు.

Exit mobile version