KCR shock to Rohith Reddy: ఇప్పటికే మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్ర*గ్స్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఈ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఈ కేసులో కేవలం మాదక ద్రవ్యాల పార్టీ మాత్రమే కాదని.. దుబాయ్ ప్రాంతంలో రాజకీయ నాయకులు ఏర్పాటు చేసుకున్న అక్రమ ఆస్తుల వ్యవహారం పై చర్చ నడిచిందని ప్రభుత్వం గుర్తించింది. బెంగళూరు, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ మీటింగ్ అయ్యారని.. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాలు స్వీకరించారని.. చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కాల్పులకు పాల్పడ్డారని.. అయితే పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారని ప్రభుత్వానికి నివేదిక అందింది.
మాదక ద్రవ్యాల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన వారందరికీ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఈ కేసు మరింత జటిలం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడితోనే ఈ వ్యవహారం ముగిసిపోలేదు. డ్ర*గ్స్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడు కూడా ఉన్నాడని.. అతడు తప్పించుకోవడానికి కాల్పులు జరిపారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రోహిత్ రెడ్డి ఉదంతం నేపథ్యంలో గులాబీ పార్టీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ విపరీతంగా యాక్టివ్ అయిపోయింది. ప్రభుత్వం కూడా పోలీసు అధికారులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడంతో.. ఈ కేసులో రోజుకొక కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.
రోహిత్ రెడ్డి విషయంలో గులాబీ పార్టీ స్పందించిన తీరు పట్ల నిన్నటి వరకు విమర్శలు వినిపించాయి. అయితే మంగళవారం రోహిత్ రెడ్డికి గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ షో కాజు నోటీస్ జారీ చేశారు. ఈ వ్యవహారంపై వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని అందులో ఆదేశించారు. దీంతో తమ పార్టీ మీద వస్తున్న విమర్శలకు గులాబీ బాస్ షోకాజ్ నోటి ద్వారా సమాధానం చెప్పినట్టు అయింది. మరోవైపు టిడిపి ఎంపీ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఆయనకు ఒక లేఖ రాశారు. చంద్రబాబు సూచనల మేరకు పార్టీ కార్యక్రమాలకు.. నియోజకవర్గానికి దూరంగా ఉండాలని సూచించారు.. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని అందులో కోరారు. ఇక పార్టీలపరంగా వ్యవహారం ఇలా ఉంటే.. ప్రభుత్వపరంగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి సీనియర్ ఐపీఎస్ అధికారి సుధీర్ బాబు నాయకత్వం వహించబోతున్నారు. ఆయన ఆధ్వర్యంలో 9 మంది అధికారులు ఈ కేసును దర్యాప్తు చేయబోతున్నారు. అసలే దొరకక దొరకక దొరికిన అవకాశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా తవ్వుతోంది. ఒకవేళ రేవంత్ ప్రభుత్వం కోరుకున్నట్టుగా గులాబీ పార్టీ ముఖ్య నేతకు సంబంధించిన సమాచారం ఏదైనా ఈ కేసులో దొరికే మాత్రం.. ఇక అప్పుడు తెలంగాణ రాజకీయాలు మరో విధంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.