KTR role in Hyderabad development: హైదరాబాద్ నగరం విభిన్న జాతుల, సంస్కృతుల కలయిక. ఒకప్పుడు హైదరాబాద్ నగరం ఒక పరిధి వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు అనంతం అనే పదాన్ని కూడా దాటిపోయింది. ఖండాంతరాల దాటి విశ్వవ్యాప్తంగా మారిపోయింది. గ్లోబల్ సిటీగా అవతరించింది. అమెరికాలోని అతిపెద్ద ఐటీ కంపెనీలు, ఐరోపా, యూరప్ లాంటి ప్రాంతాలలో ఉన్న పెద్దపెద్ద ఐటీ కంపెనీలు కూడా నేడు తమ కార్యకలాపాలను హైదరాబాదులో సాగిస్తున్నాయి. ముఖ్యంగా అతి పెద్ద ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లోనే తమ కార్యాలయాలు ఏర్పాటు చేసి.. ప్రొడక్షన్ చేస్తున్నాయి.
ఐటి, ఫార్మా మాత్రమే కాదు.. చివరికి ట్రంప్ కంపెనీ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ హైదరాబాదులో చేస్తోంది. కోకాపేట ప్రాంతంలో ఏకంగా 63 అంతస్థుల ఎత్తుతో టవర్లను నిర్మిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాదు నగర ఖ్యాతి.. విఖ్యాతి ఒక అంచనాకు అందదు. హైదరాబాద్ నగర అభివృద్ధిని చాలామంది రాజకీయ నాయకులు తమ ఘనతగా చెప్పుకుంటారు. కానీ అందులో నిజం లేదట. కూలి కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని గొప్పగా ఉండాలని భగవంతుని ప్రార్థించాడట. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన ఈ హైదరాబాదు నగరానికి బొడ్రాయి వేశారు. ఇక అప్పటినుంచి ఈ నగరం వృద్ధి చెందుకుంటూనే వస్తోంది. సరిగా ఇదే విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ కూడా ప్రస్తావించారు.
హైదరాబాద్ నగర అభివృద్ధిపై జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఒకరి వల్ల సాధ్యం కాలేదని.. అది నిరంతర ప్రక్రియ గా కొనసాగుతోందని కేటీఆర్ కుండ బద్దలు కొట్టారు..”హైదరాబాద్ నగర అభివృద్ధి ఒకరి వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. ఒక్కొక్కరు తమ పిరియడ్లో హైదరాబాద్ నగర విస్తృతి కి కృషి చేశారు. అందులో నా పాత్ర కూడా స్వల్పమే. నేనే అభివృద్ధి చేశానని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. హైదరాబాద్ విశాలమైన నగరం. ఆ నగరానికి చారిత్రిక నేపథ్యం ఉంది. అతి గొప్ప ఇతిహాసం ఉంది. ఈ నగరాన్ని కేవలం మేము మాత్రమే అభివృద్ధి చేశామని కొంతమంది నేతలు అంటుంటారు. అందులో నిజం ఉండదు. అది నిజం కూడా కాదు అని” కేటీఆర్ స్పష్టం చేశారు.
గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధి మొత్తం కేవలం కెసిఆర్ హయాంలోని సాగిందని.. కేటీఆర్ హైదరాబాద్ నగర విస్తృతికి కృషి చేశారని ప్రచారం చేసుకున్నారు. వారి ఆస్థాన మీడియాలో ఇష్టానుసారంగా కథనాలు ప్రచారం చేసుకున్నారు. కానీ అదంతా డొల్ల అని.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో అందరి పాత్ర ఉందని ఇప్పుడు సాక్షాత్తు కేటీఆరే స్పష్టం చేశారు. అంటే ఆస్థాన మీడియా రాసింది అబద్ధమా? కేవలం హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలోనేనా.. ఇంకా అనేక విషయాల్లోనూ ఇదే వర్తిస్తుందా.. కేటీఆర్ మాటల వల్ల గులాబీ ఆస్థాన మీడియాకు ఎంత కష్టం వచ్చింది.. పాపం..