Kavitha New Party: కొంతకాలంగా జాగృతి అధినేత్రి కవిత రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. తన ఇంటి పార్టీలో అవమానం జరిగిందని.. ఆడబిడ్డ కన్నీరు ఇంటికి ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్న ఆమె.. రాజకీయంగా స్వీయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఆమె తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై తీవ్రంగా సమావేశాలు.. సమాలోచనలు జరుపుతున్నారు. అంతేకాదు మేధావులతో విస్తృతంగా చర్చలు కూడా సాగిస్తున్నారు. ఇటీవల తన పార్టీ పేరు పట్ల టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన కవిత.. ఆ తర్వాత వాటి పరిష్కారానికి కృషి చేశారు. సమస్యలు మొత్తం తీరిపోవడంతో ఆమె శనివారం తన పార్టీ పేరును ప్రకటించారు.
రాజకీయాల్లోకి కొత్త శక్తిగా ఆవిర్భవిస్తున్నట్టు ప్రకటించిన కవిత.. తన పార్టీ పేరును కూడా వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ లోని ఓ కన్వెన్షన్ ప్రాంతంలో కవిత తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణను కూడా వెల్లడించారు. కవిత తన పార్టీల పేర్లు టిఆర్ఎస్ ఉండేలా చూసుకున్నారు. ఒకప్పుడు ఏ పేరు అయితే తెలంగాణలో బలంగా వినిపించిందో.. రెండుసార్లు తన తండ్రికి అధికారం దక్కేలా చేసిందో.. దానినే కవిత అమలు చేశారు. తెలంగాణకు ఇంటి పార్టీగా పేరుపొందిన టిఆర్ఎస్ ను తన పార్టీ పేరుగా ప్రకటించుకున్నారు.
ఇటీవల కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడం తప్పు అని అంగీకరించారు. అందువల్లే వచ్చే ఎన్నికల నాటికి భారత రాష్ట్ర సమితి పేరును.. తెలంగాణ రాష్ట్ర సమితిగా మారుస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో కవిత అప్రమత్తమయ్యారు. న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. చివరికి తన పార్టీ పేరును టిఆర్ఎస్ గా ప్రకటించారు. మహిళల సాధికారత.. దిగువ స్థాయి వర్గాలకు అధికారం.. సామాజిక అభివృద్ధి.. అన్ని అంశాలలో తమ పార్టీ ముందు ఉంటుందని కవిత ప్రకటించారు.
తన పార్టీ పేరులో టిఆర్ఎస్ ఉండేలా చూసుకున్న కవిత.. కెసిఆర్, కేటీఆర్ కొంప ముంచారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారత రాష్ట్ర సమితి పేరును టిఆర్ఎస్ లాగా మార్చడానికి ఇటీవల కాలంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేటీఆర్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. కానీ అవి జరుగుతుండగానే కవిత వెంటనే రెస్పాండ్ అయ్యారు. అన్ని సమస్యలను మొత్తం పరిష్కరించుకొని తన పార్టీ పేరులో టిఆర్ఎస్ ఉండేలా చూసుకున్నారు. ఇకపై కేటీఆర్ తన పార్టీ పేరును మార్చాలనుకున్నప్పటికీ కుదిరే అవకాశం లేదు.