Kavitha TRS party controversy: కవిత గులాబీ క్యాంప్ మొక్కే కదా.. ఆమెకు కూడా రాజకీయాలు తెలుసు. గతంలో కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రయోగాలు చేశారు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ స్థాయిలో ప్రతిపక్షాలను తొక్కిపెట్టారు.. చివరికి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎర్రజెండా ఎలా చూపించారు.. మునుగోడు ఉపఎన్నికల్లో కమ్యూనిస్టులను ఎలా వాడుకున్నారు.. ఇవన్నీ కవిత చూసింది.. అంతకుమించి నేర్చుకుంది. ఆ ఇంటి ఆడబిడ్డకు ఆ మాత్రం రాజకీయాలు తెలియవని కెసిఆర్ అనుకున్నారు. కేటీఆర్ కూడా అలానే భావించారు.
కవిత ఉన్నత విద్యావంతురాలు. అంతకుమించి తెలంగాణ జాగృతిని నడిపించారు. ఏ మాటకు ఆ మాట.. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో బతుకమ్మ పండుగను గొప్పగానే జరిపించారు. అందువల్లే తెలంగాణ సమాజం ఆమెను ఇంటి ఆడబిడ్డగా భావించింది. అందువల్లే తన అత్తింటి నిజామాబాద్ లో పార్లమెంట్ సభ్యురాలిని చేసింది. ఆ స్థాయిలో గెలిచిన కవిత రెండోసారి ఎందుకు అక్కడ ఎంపీ కాలేకపోయింది.. తాను ఎదుర్కొన్న ఇబ్బందులు.. పార్టీ కార్యవర్గం నుంచి సహాయ నిరాకరణ.. ఇవన్నీ కూడా కవిత ఎప్పటికప్పుడు ముంజేతి కంకణం సామెత మాదిరిగానే చెప్పుకుంటూ వచ్చింది.
తను గులాబీ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. ఆ కుటుంబంతో కూడా తెగ తెంపులు చేసుకున్న తర్వాత రాజకీయ ప్రయాణాన్ని ఒంటరిగానే మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. అది ఆమె ఇష్టం.. పైగా మన దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి.. కొన్ని పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి.. మిగతా పార్టీలు ప్రతిపక్షానికో లేదా అధికారి పక్షానికో పరిమితమయ్యాయి. కవిత రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు కొంతమంది నొసలు చిట్లించారు.. కొంతమంది విమర్శలు చేశారు.. అయినప్పటికీ ఆమె తట్టుకుంది. ప్రధానంగా గులాబీ క్యాంపు నుంచి ఆమెకు ఎదురైన దాడి మామూలుది కాదు. మొదటిదాకా ఇంటి పార్టీలో ఉన్న ఆమెకు ఇటువంటి పరిణామం ఎదురు కావడం ఒకరకంగా ఇబ్బంది కలిగించింది. అయినప్పటికీ తను ఏమాత్రం భయపడకుండా రాజకీయ పార్టీని ప్రారంభించింది.
రాజకీయ పార్టీ ప్రారంభంలో అనేక రకాలుగా కవిత లీకులు ఇచ్చింది. తెలంగాణ జాగృతి అని తెలంగాణ జాగృతి పార్టీ అని.. ఇలా రకరకాల పేర్లను ఆమె బయటకు వదిలింది. కానీ ఇక్కడే ఆమెను గులాబీ పార్టీ అధినాయకత్వం తక్కువ అంచనా వేసింది. పైగా భారత రాష్ట్ర సమితి వల్ల తమకు జరిగిన నష్టం మామూలుగా లేదని.. అందువల్లే పాత పేరును పార్టీకి పెట్టే ఆలోచనను పరిశీలిస్తున్నామని ఇటీవల కేటీఆర్ ప్రకటించారు. ఆయన ఆ ప్రకటన వరకే ఆగిపోయారు. కానీ కవిత న్యాయపరమైన చిక్కులు.. ఇతర సమస్యలను అద్భుతంగా పరిష్కరించుకొని.. తన పార్టీకి టీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంది. అదే విషయాన్ని సగర్వంగా ప్రకటించింది. ఇక్కడ కెసిఆర్ చింతించి ఉపయోగం లేదు. కేటీఆర్ ఆలోచించి ఉపయోగం లేదు. ఎందుకంటే కవిత ఆల్రెడీ మొదలుపెట్టింది.. టిఆర్ఎస్ ను సొంతం చేసుకుంది. ఎటోచ్చి టిఆర్ఎస్ ను దూరం చేసుకుంది కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆరే.