Kavitha statement on KTR: టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈక్రమంలోనే ఆమె సంచలన విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా కూడా ఆమె కొన్ని వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇది కాస్త తెలంగాణ పాలిటిక్స్ లో మరోసారి సంచలనంగా మారాయి.
తెలంగాణలో 10 సంవత్సరాలపాటు భారత రాష్ట్ర సమితి పరిపాలన సాగించింది. ఈ క్రమంలో నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కల్వకుంట్ల కవిత బయట పెట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా కూడా తన తండ్రి పరిపాలన కాలంలో చోటుచేసుకున్న విషయాలను ఆమె మొహమాటం లేకుండా చెప్పేశారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేటీఆర్ పరిపాలన సాగేదని చెప్పారు. కే అంటే కెసిఆర్.. టి అంటే తన్నీరు హరీష్ రావు.. ఆర్ అంటే కల్వకుంట్ల తారకరామారావు.. అని ఆ పేరుకు సంక్షిప్త నామం చెప్పారు కవిత. ఇప్పుడు కూడా తెలంగాణలో కేటీఆర్ పరిపాలన సాగుతోందని కవిత ఆరోపించారు. కే అంటే కొండల్ రెడ్డి.. టి అంటే తిరుపతిరెడ్డి.. ఆర్ అంటే రేవంత్ రెడ్డి అంటూ కవిత వ్యాఖ్యానించారు. ఆంధ్రా విష కోరల నుంచి రాష్ట్రాన్ని సాధించుకున్నామని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ తమ జాగీర్ అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు లేక పవన్ కళ్యాణ్ తో రెండు ఓట్లు తెచ్చుకుందామని అనుకుంటుందని.. అందువల్ల ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతుందని కవిత ఆరోపించారు.
కవిత భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత తనకంటూ సొంత రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అంతకుముందు జాగృతి ద్వారా కార్యకలాపాలు సాగించారు. ఇటీవల టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ ప్రారంభ సభలోనే కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు సాగించారు. ఇప్పుడు కేటీఆర్ పరిపాలన సాగుతోంది అన్నట్టుగా ఆరోపించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ మోడల్ లోనే పరిపాలన సాగిందని మండిపడ్డారు.
కవిత వ్యాఖ్యలను లోతుగా గమనిస్తే తన తండ్రి పరిపాలన కాలంలో తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ ఇష్టానుసారంగా సాగిందని.. అవినీతి వ్యవహారాలు అడ్డులేకుండా జరిగాయని కవిత చెబుతున్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టిఆర్ఎస్ ప్రారంభ సభలో తన తండ్రిని మర మనిషి అని కవిత ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా రేవంత్ పరిపాలనకు, కెసిఆర్ పరిపాలనకు పెద్దగా తేడా లేదని.. ఏకంగా ఇద్దరి పరిపాలనకు సంబంధించి కేటీఆర్ అనే సంక్షిప్త నామాన్ని కవిత జత చేశారు. అయితే విలేకరులతో నిర్వహించిన ప్రతి సమావేశంలోనూ కవిత ఏదో ఒక సంచలనాన్ని బయటపెడుతూనే ఉన్నారు. వచ్చే రోజుల్లో ఆమె ఇంకా ఎన్ని విషయాలు వెలుగులోకి తెస్తారు.. ఎన్ని సంచలనాలకు కారణమవుతారో చూడాల్సి ఉంది.. ఏది ఏమైనప్పటికీ కవిత ద్వారా గులాబీ పార్టీ తలదించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. సోషల్ మీడియాలో అయితే కవిత వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ట్రోలింగ్ మామూలుగా లేదు.
