Kalvakuntla Kavitha: గత నాలుగేళ్లు.. ఒక సుదీర్ఘమైన, మౌనమైన వేదన. అడుగడుగునా అవమానాలు, ప్రతిక్షణమూ సందిగ్ధం. కానీ, ఆ కన్నీటి తెరల వెనుక ఒకే ఒక్క నమ్మకం.. “సత్యం ఎప్పటికీ ఓడిపోదు” అనే దృఢ నిశ్చయం. ఇప్పుడు ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దిల్లీ మద్యం కేసులో న్యాయస్థానం తనను నిర్దోషిగా ప్రకటించడంతో, కల్వకుంట్ల కవిత ఆనందభాష్పాలతో శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!
మొక్కు తీర్చుకున్న భక్తి
తనపై పడిన మచ్చ చెరిగిపోయి, నిజం నిలబడటంతో కవిత భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్తతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున కాలినడకన తిరుమల కొండను ఎక్కి, స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆ నడక కేవలం కొండ ఎక్కడం మాత్రమే కాదు.. గత నాలుగేళ్లుగా తాను భరించిన ఆవేదనకు, ఎదుర్కొన్న పోరాటానికి ఒక రకమైన పరిహారంలా కనిపించింది.
“సత్యం గెలిచింది”
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం అందుకున్న కవిత, గొంతు గద్గదమైంది. “సత్యం, న్యాయం, ధర్మం నా వైపు ఉన్నాయని ఎప్పుడూ నమ్మాను. స్వామివారి దయతో, న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఆ కఠినకాలం ముగిసింది” అని ఆమె పేర్కొన్నారు.
కొత్త ఆశలతో ‘తెలంగాణ ఇంటి పార్టీ’
గతాన్ని వదిలేసి, కొత్త ఉత్సాహంతో ముందడుగు వేయడానికి కవిత సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచేందుకు “తెలంగాణ ఇంటి పార్టీ” పేరుతో కొత్త రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినా.. రెండు ప్రాంతాల ప్రజలు సోదరభావంతో, క్షేమంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ కొత్త ప్రయాణానికి శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, తన జీవితంలో కొత్త అధ్యాయానికి ఆత్మీయంగా శ్రీకారం చుట్టారు కవిత.