Jeevan Reddy political move: తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కాంగ్రెస్కు వెన్నెముకలా నిలిచిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. 42 ఏళ్ల కాంగ్రెస్ అనుబంధానికి ఇటీవలే స్వస్తి పలికిన రాజకీయ కృరవృద్ధుడు ఇప్పుడు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్దమయ్యాడు. జగిత్యాల నియోజకవర్గంలో జీవన్రెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే జీవన్రెడ్డి అనే రీతిలో రాజకీయం సాగింది. కానీ గత కొంత కాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు, అవమానాలు ఆయనను తీవ్రంగా కలిచివేశాయి. దీంతో పార్టీకి గుడ్బైయ్ చెప్పాడు.
సంజయ్కుమార్ ఫిరాయింపుతో..
బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కాంగ్రెస్లో చేరడం జీవన్రెడ్డి నిర్ణయానికి ప్రధాన కారణమైంది. ఎన్నికల్లో జీవన్రెడ్డి ఓటమి పాలవగా, సంజయ్కుమార్ గెలిచారు. అనూహ్యంగా సంజయ్ కాంగ్రెస్లో చేరడం, ఆయనకు ప్రభుత్వం, పార్టీలో ప్రాధాన్యత పెరగడం జీవన్రెడ్డికి మింగుడుపడలేదు. దీంతో కీలక నిర్ణయం తీసుకుని, గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. దీంతో ఇంతకాలం తిట్టిన గులాబీ పార్టీ నేతలతోనే త్వరలో పొగిడించుకోబోతున్నారు.
జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ ప్లీనరీ..
జీవన్రెడ్డి చేరిక తర్వాత జగిత్యాల వేదికగానే బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27న జగిత్యాల సమీపంలోని వ్యవసాయ భూముల్లో భారీ ఎత్తున ఈ సమావేశం నిర్వహించే యోచనలో అధిష్టానం ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తర్వాత స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్లీనరీ సభ వేదిక మీదుగానే కేసీఆర్ జీవన్రెడ్డికి అప్పగించే బాధ్యతలను ప్రకటించనున్నారు. జీవన్రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తున్న నేపథ్యంలో బలమైన సంకేతాలను పంపించేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
Also Read: ‘పోలీస్ మామలు’ వాట్సాప్ గ్రూప్ లోకి ఎస్ఐ ఎంట్రీ.. మందుబాబుల పరుగో పరుగో.. ట్విస్ట్ అదిరింది
ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ప్రభావం..
జీవన్రెడ్డి చేరికతో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్కు బలమైన నేతను కోల్పోయినట్లైంది. బీఆర్ఎస్కు మాత్రం బలం చేకూరనుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం పట్ల జీవన్రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.
జీవన్రెడ్డికి కీలక పదవి..
జీవన్రెడ్డి చేరికతోపాటు, ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యవేక్షణ బాధ్యతలు ఇవ్వవచ్చని తెలుస్తోంది. కేసీఆర్ హామీతోనే జీవన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జీవన్రెడ్డి చేరిక తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు కానుంది. కాంగ్రెస్లోని ఇతర అసంతృప్త నేతలు కూడా బీఆర్ఎస్వైపు చూసే అవకాశం ఉంది. జగిత్యాల ప్లీనరీ ద్వారా బీఆర్ఎస్ తన బలాన్ని చాటుకోవాలని భావిస్తోంది.
42 ఏళ్ల కాంగ్రెస్ ప్రయాణానికి తెరదించి, గులాబీ గూటికి చేరుతున్న జీవన్రెడ్డి నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. జగిత్యాల వేదికగా జరగనున్న ప్లీనరీ ఈ మార్పుకు సాక్ష్యం నిలవనుంది.
