Jeevan Reddy Joins BRS: రాజకీయాలు ఇలా ఉంటాయని అనుకోవద్దు. అలానే సాగిపోతాయని భావించవద్దు. వ్యక్తుల అవసరాల ఆధారంగానే రాజకీయాలు సాగుతూ ఉంటాయి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయాలను మార్చుకుంటారు. మార్చుతూనే ఉంటారు.. ఈ దేశంలో.. రెండు తెలుగు రాష్ట్రాలలో.. రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకున్న నేతలే ఉన్నారు గాని.. రాజకీయాల కోసం మారిన నేతలు లేరంటే అతిశయోక్తి కాదు.
విలక్షణమైన రాజకీయాలకు తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెట్టింది పేరు. ఇప్పుడు ఈ జిల్లా పతాక శీర్షికలో సాగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని జగిత్యాల పట్టణం లో సాగుతున్న రాజకీయాలు సరికొత్త ఒరవడి ప్రశ్నిస్తున్నాయి. జగిత్యాలలో దాదాపు దశాబ్దాల పాటు జీవన్ రెడ్డి చక్రం తిప్పారు. ముందు తెలుగుదేశం పార్టీలో.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగారు. రెండు పార్టీలలో కూడా పదవుల అనుభవించారు. భారీగా అనుచర గణాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అడుగడుగునా ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. దీంతో పార్టీకి ఆయన రాజీనామా చేశారు. అదే కాదు త్వరలో గులాబీ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తన ప్రత్యర్థి అయిన సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు..
గులాబీ పార్టీలో చేరడం పక్కా అయినప్పటికీ.. గుంపులో గోవిందం లాగా ఉండాలని జీవన్ రెడ్డి అనుకోవడం లేదు. జీవన్ రెడ్డి మొత్తంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడాప్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జగిత్యాల నియోజకవర్గం వ్యాప్తంగా ఆయన యాత్ర చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. గతంలో జగన్మోహన్ రెడ్డి తనకు అన్యాయం జరిగిందని ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజలలో సెంటిమెంట్ రగిలించారు. తద్వారా 2019లో ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేసేసి.. ప్రతి గ్రామంలో తిరిగి.. ఆవేదన మొత్తం ప్రజలకు వివరించి.. సానుభూతిని పొందాలని ఆయన ప్రణాళిక రూపొందించిన తెలుస్తోంది. తన అనుచరులతో జీవన్ రెడ్డి ప్రాథమిక ప్రణాళిక రూపొందించారని.. తన భవిష్యత్తు రాజకీయాల గురించి చర్చలు కూడా సాగించినట్టు తెలుస్తోంది.. కాంగ్రెస్ పార్టీకి ఎంతో చేసినప్పటికీ.. తనను పక్కనపెట్టిందని.. అందువల్ల తను యాత్ర చేయాల్సి వస్తుందనే విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి జీవన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఇమేజ్ మొత్తాన్ని తనకు ఆపాదించుకున్నారు. జనాలు కూడా వైయస్ జగన్ లో రాజశేఖర్ రెడ్డిని చూశారు. ఇప్పుడు జీవన్ రెడ్డి వయసు దాదాపు 75 సంవత్సరాలు. ఇంతటి వయసులో ఆయన పోరాటం చేసి ఏం చేస్తారు.. మహా అయితే ఎమ్మెల్యే అయితారు.. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ గనుక గెలిస్తే మంత్రిగా కేసీఆర్ అవకాశమిస్తారా? ఒకవేళ జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తే మిగతావాళ్లు తిరుగుబాటు చేపట్టరా? అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
