IVF : ఈ విషయంలో తమ ప్రభుత్వం కమిట్మెంట్తో ఉందని.. అందుకే ప్రకటించిన నెల రోజుల్లోనే ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఎంబ్రియాలజిస్ట్ సహా అవసరమైన స్టాఫ్ను నియమించామని, ఎక్విప్మెంట్, రీఏజెంట్స్, మెడిసిన్ కొనుగోలు కోసం నిధులు కేటాయించామని చెప్పారు. ఆధునిక జీవన విధానంతో ఎంతో మంది ఇన్ఫెర్టిలిటీ సమస్య బారిన పడుతున్నారని, చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లి లక్షలు ఖర్చు చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఒక్క గాంధీకే ఫెర్టిలిటీ సేవలను పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించామని తెలిపారు. మరో 15 రోజుల్లోనే పేట్లబుర్జు దవాఖానలో ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ ఫెర్టిలిటీ సెంటర్లను, ఐవీఎఫ్ సేవలను విస్తరిస్తామని చెప్పారు. లక్షలు ఖర్చయ్యే చికిత్సను, పూర్తిగా ఉచితంగా అందజేస్తామన్నారు. ఐవీఎఫ్ను ఆరోగ్య శ్రీ కింద చేర్చామని ప్రకటించారు. తద్వారా మెడిసిన్స్ ను కూడా ఉచితంగా అందజేస్తామని మంత్రి అన్నారు.
రూ.80 కోట్లతో హాస్టల్ భవనాలు
గాంధీ మెడికల్ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల హాస్టల్ కోసం 7 అంతస్తుల బిల్డింగ్, బాయ్స్ హాస్టల్ కోసం 3 అంతస్తుల బిల్డింగ్, సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్ కోసం 6 ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మిస్తున్నామని మంత్రి దామోదర తెలిపారు. ఇందుకోసం రూ.80 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇప్పటికే సుమారు రూ.120 కోట్లతో ఉస్మానియా మెడికల్ కాలేజీలో హాస్టల్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. హాస్టల్ బిల్డింగుల సమస్యను జూనియర్ డాక్టర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని.. వారు తెలిపిన రెండ్రోజుల్లోనే సుమారు రూ.200 కోట్లు కేటాయించామని ఆనందం వ్యక్తం చేశారు.. పది సంవత్సరాల నుంచి ఉస్మానియా హాస్పిటల్ పెండింగ్ లో ఉందని..పెండింగ్ లో ఉన్న కొత్త బిల్డింగ్కు కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రోడ్డు యాక్సిడెంట్లు, ఇతర ఎమర్జెన్సీ ఘటనల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు 74 ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. గోషామహల్లో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త హాస్పిటల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. క్యాన్సర్ పేషెంట్లను ఆదుకోవడానికి 6 రీజినల్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి వెల్లడించారు.