Adilabad: మూడు ఊళ్ల నోముల ‘ఫలం’.. ఒకే ఒక్క మామిడి చెట్టు కథ!

ప్రతీ ఊరిలో మామిడి చెట్లు ఉండడం సహజమే. కానీ ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం బావోజీపేట్‌లో మాత్రం మూడు గ్రామాలకు ఓకే చెట్లు . విచిత్రంగా ఉంది కదూ.

Written By: Raj Shekar, Updated On : April 7, 2024 11:01 am

Adilabad

Follow us on

Adilabad: అందరూ పెళ్లి కావాలని, పిల్లలు పుట్టాలని పూజలు చేస్తారు.. నోములు నోస్తారు. కొందరు డబ్బుల కోసం, ఇంకొందరు ఆరోగ్యం కోసం గుళ్లు గోపురాలు తిరుగుతారు. అన్ని గుడి మెట్లు ఎక్కుతారు. కనిపించిన రాయికి మొక్కుతుంటారు. అయితే ఇక్కడ విచిత్రంగా ఆ మూడు గ్రామాల ప్రజలు మామిడి చెట్టు కోసం పూజలు చేశారు. ఎన్నో నోములు నోచారు. సుదీర్ఘ పూజల ఫలితం, ఎన్నో ప్రయత్నాల తర్వాత మూడు గ్రామాలకు కలిపి ఒకే ఒక్క మామిడి చెట్టు మొలిచింది. ఆరేళ్ల క్రితం మొలిచిన ఈ మొక్క ఇప్పుడు పెరిగి పెద్దదై ఫలాలు అందిస్తోంది.

చెట్టు మొలవక..
ప్రతీ ఊరిలో మామిడి చెట్లు ఉండడం సహజమే. కానీ ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం బావోజీపేట్‌లో మాత్రం మూడు గ్రామాలకు ఓకే చెట్లు . విచిత్రంగా ఉంది కదూ. ఎందుకలా అంటే అక్కడ ఎత్తయిన గుట్టల కింద, పక్కనే కడెం వాగును ఆనుకుని ఉన్న బావోజీపేట పంచాయతీకి పక్కనే రెండు అనుబంధ గ్రామాలు లంబాడితండా, బొజ్జుగూడ ఉన్నాయి.

మామిడి చెట్లే లేవు..
అయితే ఈ గ్రామాలు ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ మామిడి చెట్లు లేవు. చాలా మంది రైతులు మామిడి చెట్లు పెంచడానికి ప్రయత్నించారు. వివిధ ప్రాంతాల నుంచి విత్తనాలు తీసుకొచ్చి నాటారు. అయినా ఫలితం లేకపోయింది. వందల విత్తనాలు వేసిన ఒక్కటి కూడా మొలకెత్తలేదు. దీంతో ఇక గ్రామస్తులు మామిడిని నాటే ప్రయత్నాలు విరమించుకున్నారు.

ఆరేళ్ల క్రితం ఒకే ఒక్కటి..
ఇక తమ గ్రామాల్లో మామిడి మొక్కలు మొలవవని నిరాశతో ఉన్న ప్రజల ఆశలు ఆరేళ్ల క్రితం చిగురించాయి. గ్రామానికి చెందిన మెస్రం ఇంద్రు పంట పొలంలో ఓ చిన్న మామిడి మొక్క మొలిచింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఆ మొక్కను రైతుతోపాటు ఆ గ్రామస్తులు దానిని కంటికి రెప్పలా కాపాడారు. పెంచి పెద్ద చేశారు.

ఫలాలిస్తున్న మామిడి..
రైతుతోపాటు గ్రామస్తుల శ్రమ ఫలించింది. ఆ చెట్టు రెండేళ్లుగా కాయలు కాస్తోంది. దీంతో కోతులు, ఇతర జంతువులు రాకుండా ఉండేందుకు రక్షణగా గ్రామస్తులు కాపలా ఉంటున్నారు. చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేశారు. ఇక ఏటా కాసిన మామిడి పండ్లను మూడు గ్రామాల ప్రజలు పంచుకుంటున్నారు. ఇలా ఆ మామిడి చెట్లు మూడు ఊళ్లకు రాజుగా నిలిచింది.