HomeతెలంగాణCM Revanth Reddy: గ్యారంటీలు గట్టెక్కిస్తాయా.. రేవంత్‌ ఆశలు అవే..!

CM Revanth Reddy: గ్యారంటీలు గట్టెక్కిస్తాయా.. రేవంత్‌ ఆశలు అవే..!

CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ విజయంలో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కీలకపాత్ర పోషించాయి. మరోవైపు బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యాంరటీలు అమలు చేస్తామని నాటి పీసీసీ చీఫ్‌గా నేటి సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 75 రోజులు గడిచింది. ఇప్పటికి కేవలం ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మాత్రమే అమలవుతున్నాయి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు రుణ కార్డులు, విద్యార్థినులకు స్కూటీలు, రైతులకు రుణమాఫీ, రైతుభరోసా పెంపు, కౌలు రైతులకు పెట్టుబడి వంటి హామీలు అమలు చేయాల్సి ఉంది.

ఎన్నికల వేళ మరో రెండు హామీల అమలు..
వంద రోజుల పాలన పూర్తి కావొస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై కసరత్తు మొదలు పెట్టింది ఫిబ్రవరి 27 లేదా 29 నుంచి మరో రెండు గ్యారంటీలు అమలు చేయాలని చూస్తోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్‌ అమలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈమేరకు ఆదేశాలు రావడమే ఆలస్యం. కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రకటించారు. వారం రోజుల్లో మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు.

లబ్ధి కొందరికే..
ఇక గ్యారంటీల అమలుకు ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. వాటి ఆధారంగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేకు నమోదు పూర్తి చేసింది అయితే లబ్ధిదారులు మాత్రం కేవలం రేషన్‌కార్డు ఉన్నవారే అని సీఎం రేవంత్‌ ప్రకటించారు. రేషన్‌కార్డు లేనివారికి ఈ రెండు హామీలు వర్తించవు అని సీఎం చెప్పకనే చెప్పారు. మరోవైపు ఇంటికి ఒక మీటరుకు మాత్రమే లబ్ధి అని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అద్దె ఇళ్లలో ఉన్నవారికి లబ్ధి చేకూరే అవకాశం లేదు. ఇంటి యజమానికి రేషన్‌ కార్డు ఉంటే.. ఒక మీటరుకు మాత్రమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందుతుంది. అద్దెకు ఉన్నవారు నష్టపోవడం ఖాయం. రేషన్‌కార్డు ఉన్నా వారికి ప్రయోజనం ఉండదు.

ఎన్నికల కోసమే హడావుడి..
వంద రోజుల సమయం గడువు సమీపిస్తుండడం, మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు మరో పది రోజుల్లో షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా గ్యారంటీల అమలుకు చర్యలు చేపడుతోంది. అయితే సగం మంది అర్హులు లబ్ధి పొందలేకపోవడం కూడా ఇబ్బందికరమే. మొదట రేషన్‌ కార్డులు జారీ చేసి.. తర్వాత గ్యారంటీలు అమలు చేస్తే బాగుండేది అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు హడావుడిగా అమలు చేస్తున్న గ్యాంటీలు కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఏమేరకు లబ్ధి చేకూరుస్తాయో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version