Bandi Sanjay : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బండి సంజయ్ మళ్లీ రావాలా?

గత ఎన్నికల సమయంలో సౌత్ రాష్ట్రాలపై బీజేపీ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ప్లాన్ చేసింది. అందులోనూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేసినప్పటికీ ఆ స్థాయిలో ఫలితాలు రాలేకపోయాయి. అయితే.. దీనికి ప్రధాన కారణం కూడా సంజయ్‌ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పక్కన పెట్టడం అనేది బహిరంగ టాక్.

Written By: Srinivas, Updated On : September 19, 2024 1:46 pm

Bandi Sanjay

Follow us on

Bandi Sanjay :  బండి సంజయ్ కుమార్.. ఒకప్పుడు కరీంనగర్ నగర పాలక సంస్థలో కార్పొరేటర్. కార్పొరేటర్ స్థాయి నుంచి ఈ రోజు కేంద్ర మంత్రి వరకూ ఎదిగారు. కరీంనగర్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ఈ రోజు ఢిల్లీకి స్థాయికి చేరింది. అలాగే.. పార్టీకి కూడా తెలంగాణలో హైప్ తీసుకురావడంతో ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. గత ఎన్నికల సమయంలో సౌత్ రాష్ట్రాలపై బీజేపీ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ప్లాన్ చేసింది. అందులోనూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేసినప్పటికీ ఆ స్థాయిలో ఫలితాలు రాలేకపోయాయి. అయితే.. దీనికి ప్రధాన కారణం కూడా సంజయ్‌ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పక్కన పెట్టడం అనేది బహిరంగ టాక్.

2020, మార్చి నెలలో బండి సంజయ్ కుమార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన అధ్యక్షుడిగా కొనసాగినన్న రోజులు పార్టీని గల్లీ వరకూ విస్తరింపజేశారు. ఏ గ్రామానికి వెళ్లినా బీజేపీ అంటే తెలిసొచ్చేలా అవగాహన కల్పించారు. సంజయ్ అధ్యక్షుడు కాకముందు రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభావం చాలా తక్కువ. కానీ.. ఆయన ఎప్పుడైతే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి పార్టీ పరిస్థితి చాలా వరకూ మారిపోయింది. ప్రభుత్వంపై కొట్లాడడంలో కానీ.. ప్రజా సమస్యలపై పోరాడడంలో కానీ.. అధికార పార్టీపై పంచ్‌లు వేయడంలో కానీ.. అధికార పార్టీ నేతల్ని కడిగేయడంలో కానీ.. ఆయనకు ఆయనే సాటి. ఒకానొక సందర్భంలో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఏ ఎన్నిక వచ్చినా ఆయన తమ ప్రాంతానికి వచ్చి పార్టీ తరఫున ప్రచారం చేయాలనే డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా వినిపించింది.

అటు పార్టీలోనూ అధిష్టానం నుంచి మంచి సపోర్టు లభించింది. దాంతో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ఒకప్పుడు బీజేపీని రాష్ట్రంలో కేవలం జాతీయ పార్టీగానే పరిగణిస్తే.. ఆయన రాష్ట్ర అధ్యక్షుడయ్యాక మాత్రం మహాశక్తిలా మారిపోయింది. అదే ఊపులో పోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీగా మారిపోయింది. అయితే.. అనూహ్య పరిణామాలతో బీజేపీ అధిష్టానం ఆయనను అధ్యక్ష పదవి నుంచి పక్కకు జరిపింది.

2023 జూలైలో సంజయ్‌ని తప్పిస్తూ బీజేపీ అధిష్టానం మరోసారి కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా అధిష్టానంపై విమర్శలు వచ్చాయి. ఆయన అనుచరులు, పార్టీ అభిమానుల నుంచి నిరసనలూ వెల్లువెత్తాయి. బండి సంజయ్‌నే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ వినిపించింది. అయినా అధిష్టానం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అనుకున్న పార్టీ పరిస్థితి తలకిందులైంది. ఈసారి పక్కాగా అధికారంలోకి వస్తుందనుకున్న బీజేపీ చివరకు 8 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది.

అయితే.. ఇప్పుడు బీజేపీ మరోసారి బండి సంజయ్‌ని అధ్యక్షుడిని చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంతో ఉన్న బీజేపీ అధిష్టానం.. ఇందుకు సంజయ్ అయితేనే సరైన వాడని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆయన వస్తే రాష్ట్రంలో కమలం పువ్వు మళ్లీ విరబూస్తుందని, పార్టీ జవసత్వాలు వస్తాయని అధిష్టానం నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే.. త్వరలోనే రాష్ట్ర పార్టీ పగ్గాలు మరోసారి సంజయ్ చేతికి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.