Kummera jathara Tragedy: కులం ఎప్పుడూ కూడు పెట్టదు. మతం ఎప్పుడూ మనుగడు ఇవ్వదు. ఈ మాటలు పుస్తకాలలో చాలా గొప్పగా ఉంటాయి. వాస్తవంలో మాత్రం అలా ఉండదు. ఎందుకంటే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ జమానాలో ఉన్న మనం ఇప్పటికీ కులాన్ని పట్టుకొని తిరుగుతుంటాం. మతాన్ని ప్రతి విషయంలోనూ అదిమి పట్టుకుంటాం. దేశం విషయంలో ఏదైనా జరిగితే పట్టించుకోము గాని.. కులంలో.. మతంలో ఏదైనా తేడా జరిగితే మాత్రం రోడ్లమీదకి వస్తాం.
గతంలో కులానికి సంబంధించి.. మతానికి సంబంధించి ఏవైనా ఘటనలు జరిగినప్పుడు అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కులం పేరుతో.. మతం పేరుతో దారుణాలు.. ఘోరాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఒక భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక టికెట్ కోసం గొడవ జరిగింది.. అది కూడా ఒక జాతర సమయంలో టికెట్ కొనుగోలు చేయలేదని.. అగ్రకులాల వ్యక్తులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. టికెట్ కొనుగోలు చేయని కుటుంబం పై దాడి చేశారు. రెండు నెలల చిన్నారిని కాలుతో తన్నారు. దీంతో ఆ చిన్నారి కన్ను మూసింది. ఈ జాతర నిర్వహణను కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో ఈ గొడవ జరిగింది. ఈ గొడవలో రెండు నెలల చిన్నారి చనిపోయింది. జాతరకు వెళ్లిన భక్తుల పట్ల నిర్వాహకులు అమర్యాదగా ప్రవర్తించారు. ఇదే సమయంలో దాడి కూడా చేశారు. దాడి జరుగుతున్న సమయంలో రెండు నెలల పసికందు పురాణాలు కోల్పోయింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చివరికి బీసీ కమిషన్ స్పందించి.. నోటీస్ కూడా జారీ చేసింది.
కుమ్మెర గ్రామానికి చెందిన గణేష్, తన భార్య మౌనికతో కలిసి ఈ నెల 18న మల్లన్న జాతరకు వెళ్ళాడు. గణేష్ జాతరకు వెళ్తున్న సమయంలో వారి వెంట బంధువు చంద్రకళ.. రెండు నెలల చిన్నారి కూడా ఉంది. దేవదర్శనానికి గణేష్ కుటుంబం వెళ్తుండగా.. టికెట్ ధర విషయంలో గొడవ జరిగింది. ఆలయ నిర్వహకుడు శ్రీనివాసరెడ్డి.. చంద్రకళ తీవ్రంగా గొడవపడ్డారు. వంద రూపాయలు చెల్లించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేయడంతో.. చంద్రకళ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో గణేష్, ఆలయ నిర్వాహకులకు గొడవ జరిగింది. చివరికి తోపులాట జరిగింది. ఈ ఘటనలో మౌనిక.. తన చిన్నారితో సహా కింద పడిపోయింది. ఆ సమయంలో ఊపిరి ఆడక చిన్నారి అస్వస్థతకు గురైంది. ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే శనివారం రాత్రి చిన్నారి చనిపోయింది.
ఆధిపత్య కులాలు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం జరిగిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది. వంద రూపాయలు టికెట్ విషయంలో జరిగిన గొడవ.. రెండు నెలల చిన్నారి ప్రాణం తీసింది. ఇప్పటికి మనం గొప్పగా ఉన్నామని.. అత్యంత ఆధునికమైన జీవితాన్ని గడుపుతున్నామని చెప్పుకుంటాం. కానీ కులం కుంపట్లు.. మతం మంటల్లో నిత్యం కాలిపోతూనే ఉంటాం. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనే ఒక బలమైన నిదర్శనం.