Hyderabad: విశ్వనగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ను నిత్య నూతనంగా ఉంచేందుకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు పాలకులు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నగరంలో రద్దీ తగ్గింపుపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ఫోర్త్ సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టారు. మూసీ పునరుజ్జీవం కోసం ప్రణాళిక రూపొందించారు. తాజాగా నగరంలో పెరుగుతున్న వాహన రద్దీ, ప్రమాదాల నేపథ్యంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని ట్రిపుల్ఎటీ–హైదరాబాద్ సంస్థ రద్దీ కూడళ్లపై తాత్కాలిక, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం అధ్యయనం ప్రారంభించింది. ఇప్పటికే 21 అత్యధిక ట్రాఫిక్ పాయింట్లను గుర్తించగా, మరిన్ని ప్రాంతాలను పరిశీలించి నివేదిక సమర్పించనుంది. ఈ ప్రాంతాల్లో స్కైవేలు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తారు.
ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వరకు..
ఉప్పల్ జంక్షన్లో ట్రాఫిక్ను తగ్గిస్తూ మెట్రో స్టేషన్తో అనుసంధానించబడిన ఫుట్వే ఇప్పటికే మంచి ఫలితాలు ఇస్తోంది. ప్రస్తుతం మెహిదీపట్నంలో స్కైవే పనులు కొనసాగుతున్నాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేఎన్టీయూ జంక్షన్ వద్ద సర్వేలు ప్రారంభమయ్యాయి. త్వరలో మియాపూర్, ఐకియా, ఎల్బీనగర్, ఐటీ కారిడార్లోని 10–15 కీలక కూడళ్లలో కూడా స్కైవేలు అమలుకాబోతున్నాయి.
పీపీపీ మోడల్లో ప్రాజెక్టులు
నగరంలో రద్దీ ప్రాంతాల సంఖ్య అధికంగా ఉండగా, ప్రభుత్వ నిధులపై మాత్రమే ఆధారపడకూడదని హెచ్ఎండీఏ భావిస్తోంది. కొన్నిచోట్ల పీపీపీ విధానంలో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో మాల్స్, ఐటీ భవనాలు, మెట్రో స్టేషన్లతో నేరుగా కలుపుకునే మార్గాలు ఏర్పాటు చేయడం లక్ష్యం. ఇది పాదచారుల కదలిక సులభతరం చేయడంతో పాటు ట్రాఫిక్ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది.
ప్రమాదాలే హెచ్చరికగా..
గత ఏడాది నగరంలో నమోదైన 1,032 పాదచారుల ప్రమాదాల్లో 400 మంది మృ చెందగా, 775 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల్లో 42 శాతం పాదచారులే ఉండటం ఈ ప్రాజెక్టులకు ప్రేరణగా మారింది. ప్రత్యేకంగా ఐటీ కారిడార్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు జరిగిన ప్రమాదాల్లో 190 మంది పాదచారులు ప్రాణాలు కోల్పోవడం అధికారులు మేల్కొన్నారు.
పొడవైన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోడ్లు దాటే ప్రమాదం నుంచి బయటపడటానికి లిఫ్టులు, ఎస్కలేటర్లతో కూడిన ఆధునిక స్కైవేలు ప్రజలకు ఉపశమనం కలిగించనున్నాయి. పాదచారుల రవాణా భద్రతను కాపాడుతూ, స్మార్ట్ సిటీ లక్ష్యానికి చేరువ కాగలదన్న ఆశతో ఈ ప్రాజెక్టులు త్వరలో రూపుదిద్దుకోనున్నాయి.