Hyderabad Women Safety: ఉదయం నుంచి మీడియాలో.. సోషల్ మీడియాలో ఇదే చర్చ.. ఎలా ఉండే హైదరాబాద్ ఎలా మారిపోయిందని.. యువతరానికి ఏమైందని.. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీగా మారిపోయిన తర్వాత రాత్రికి, పగలుకు తేడా లేకుండా పోయింది. రకరకాల ఉద్యోగాలు.. రకరకాల వ్యవహారాలు మాత్రమే కాదు రకరకాల సంస్కృతులు కూడా హైదరాబాద్ నగరానికి వచ్చేశాయి. కాకపోతే ఇందులో మంచికి బదులు చెడును యువత వెతుక్కోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల కాలంలో దిల్ షుక్ నగర్ ప్రాంతంలో పోకిరిల ఆగడాలు పెరిగిపోయాయి. ఆడపిల్లల్ని వేధిస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయ్. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి మల్కాజ్ గిరి సీపీ సుమతి రంగంలోకి దిగారు. మంగళవారం రాత్రి ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆమె సివిల్ డ్రెస్ లో ఒంటరిగా ఓ ప్రాంతంలో నిల్చున్నారు. ఈ క్రమంలో అక్కడికి కొంతమంది యువకులు వచ్చారు. ఆమెను చూసి ద్వంద్వార్ధాలు వచ్చే విధంగా మాట్లాడారు. ఆ తర్వాత పిచ్చి సైగలు చేశారు.
ఈ నేపథ్యంలో సుమతి మరో ప్రాంతానికి కూడా వెళ్లారు. అక్కడ కూడా యువకులు అలానే ప్రవర్తించారు. ఇలా అనేక ప్రాంతాలు ఆమె మారినప్పటికీ.. అన్నిచోట్ల కూడా సుమతికి అటువంటి అనుభవమే ఎదురయింది. దీంతో మఫ్టీ లో ఉన్న ఇతర పోలీసులు సుమతిని వేధించిన వారందరినీ పట్టుకున్నారు. వారికి తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. సుమతిని వేధించిన వారిలో అందరూ కూడా కాలేజీ యువకులు ఉండడం విశేషం. వారిలో కొంతమంది ఉద్యోగులు కూడా ఉన్నట్టు పోలీసుల పరిశీలనలో తేలింది. సుమతిని వేధించిన వారిలో చాలామంది గంజాయి మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఆపరేషన్ మొత్తం అర్ధరాత్రి పూట జరిగింది. వాస్తవానికి ఈ స్థాయిలో పోకిరిలు ఒక ఐపీఎస్ అధికారిని వేధిస్తున్నారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని హైదరాబాద్ ప్రజలు అంటున్నారు. హైదరాబాద్ నగరంలో కొంతకాలంగా గంజాయి బాడకం పెరిగిపోయింది. పోకిరిలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. రాత్రిపూట బైకుల మీద ప్రమాదకరమైన స్థాయిలో ప్రయాణాలు సాగిస్తున్నారు. సుమతికి ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని.. హైదరాబాద్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.. లేనిపక్షంలో ఈ తరహా సంఘటనలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉంటాయని చెబుతున్నారు.