spot_img
HomeతెలంగాణKCR: కవిత కోసం కేసీఆర్‌ కాంప్రమైజ్‌ అయ్యారా?

KCR: కవిత కోసం కేసీఆర్‌ కాంప్రమైజ్‌ అయ్యారా?

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ తీవ్ర సంక్షోభం ఎదుక్కొంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ పరిస్థితి తయారైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన పది రోజుల్లోనే కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో జారిపడ్డారు. తుంటి ఎముక విరగడంతో దాదాపు మూడు నెలలు బయటకు రాలేదు. కేసీఆర్‌ కోలుకునే నాటికే బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు కాంగ్రెస్‌లోకి టచ్‌లోకి వెళ్లారు. ఆయన బయటకు వచ్చాక ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. కీలక సీనియర్‌ నాయకులు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. వలసలు కొనసాగుతుండగానే కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ అయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్ట్‌ చేసింది. పది రోజుల కస్టడీ తర్వాత తిహార్‌ జైలుకు తరలించింది. ఏప్రిల్‌ 10 సీబీఐ అరెస్ట్‌ చేసింది. సీబీఐ కూడా 3 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేసింది. తర్వాత తిహార్‌ జైలుకు తరలించింది.

కూతురు కోసం కేసీఆర్‌..
కవిత అరెస్ట్‌ అయి నెల రోజులైనా.. ఆమె తండ్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ అరెస్ట్‌ను ఖండించలేదు. ఇక కవిత నెల రోజులుగా తిహార్‌ జైల్లో ఉంటున్నా ఆమెను కలవడానికి వెళ్లడం లేదు. కేటీఆర్, హరీశ్‌రావు మాత్రమే కవిత అరెస్ట్‌ను ఖండించారు. ఢిల్లీ వెళ్లి మరీ కలిసి వచ్చారు. కవిత తల్లి కూడా ఒకసారి పరామర్శించారు. కేసీఆర్‌ మాత్రం వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు.

మోదీతో కుమ్మక్కు?
ఇక కవితను కాపాడుకునేందుకు కేసీఆర్‌ మోదీతో కుమ్మక్యయ్యారా? అందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సహకరించబోతున్నారా? ఈమేరకు ఒప్పందం కుదిరిందా..? కాంగ్రెస్‌ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీతో కలిసి కుట్రలు చేస్తాన్నారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. నారాయణపేటలో నిర్వహించిన జన జాతర సభలో కేసీఆర్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుపాలైన కూతురును కాపాడుకునేందుకు బీజేపీతో జతకట్టారని ఆరోపించారు. బిడ్డ కోసం ప్రధాని నుంచి సుపారీ తీసుకున్నారని తెలిపారు.

ఐదు సీట్లలో బీజేపీకి మద్దతు..
ఇక ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఐదు లోక్‌సభ స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈమేరు చేవెళ్ల, మల్కాజ్‌గిరి, జహీరాబాద్, మహబూబ్‌నగర్, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను పోటీకి పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పడగొట్టేందుకు కేసీఆర్‌ , నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ప్రభుత్వం పడిపోతుందని..
ఇక లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ పడిపోతుందని బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు పేర్కొంటున్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోని ఏక్‌నాథ్‌షిండేలు ఆ పార్టీని చీలుస్తారని ఆరోపించారు. ఇద్దరు ముగ్గురు షిండేలు ఉన్నారని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్‌గా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.

బీజేపీతో రేవంత్‌ కుమ్మక్కు..
మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతలు రేవంత్‌రెడ్డీ బీజేపీతో కుమ్మక్కయ్యాడని ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి 30 మంది ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలో చేరతారని ఆరోపిస్తున్నారు. తాను ఎన్నిసార్లు ఈ ఆరోపణ చేసిన రేవంత్‌ మౌనం వహించడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఈ క్రమంలోనే మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను పోటీకి దించి బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్‌ అభ్యర్థుల ఎంపికలో జాప్యం వెనుక కూడా బీజేపీ ఉందని ఆరోపిస్తున్నారు.

మొత్తంగా తెలంగాణలో కుమ్మకు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీంయ వేడెక్కుతోంది. ఒకవైపు ఎన్నికల ప్రచారం, మరోవైపు కుమ్మకు ఆరోపణు చర్చనీయాంశమవుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular