Harish Rao: నమస్తే తెలంగాణ భారత రాష్ట్ర సమితి కరపత్రం. ప్రపంచం మొత్తం మునిగిపోయినా సరే.. అంతకుమించిన అద్భుతం జరిగిన సరే.. ఆ పత్రికకు భారత రాష్ట్ర సమితి డబ్బా మాత్రమే కావాలి. ఆ పార్టీకి సంబంధించిన ప్రచారం మాత్రమే చేయాలి. కెసిఆర్ అడుగుపెడితే వార్త.. కేటీఆర్ హెలికాప్టర్లో తిరిగితే వార్త.. అప్పట్లో కవిత పార్టీలో ఉన్నప్పుడు.. ఆమె బతుకమ్మ ఆడితే వార్త.. సంతోష్ రావు మొక్క నాటితే వార్త.. ఇలా ఉండేది పరిస్థితి. ఏ మాటకు ఆ మాట హరీష్ రావుకు నమస్తే తెలంగాణ మొదటి నుంచి పెద్దగా ప్రయారిటీ ఇచ్చింది లేదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే.. అది కూడా కేసీఆర్, కేటీఆర్ అందుబాటులో లేనప్పుడు.. ఎటువంటి పొలిటికల్ ప్రోగ్రాములు పెట్టుకోనప్పుడు మాత్రమే నమస్తే తెలంగాణ హరీష్ రావుకు కొంతలో కొంత స్పేస్ ఇచ్చేది.

ఇటీవల కాలంలో నమస్తే తెలంగాణలో హరీష్ రావుకు అప్పుడప్పుడు మాత్రమే ప్రాధాన్యం లభిస్తుంది. అది కూడా ఆయన ఇరిగేషన్.. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ల మీద కీలకమైన అంశాలు ప్రస్తావించినప్పుడు మాత్రమే నమస్తే తెలంగాణ ఆయన వార్తలకు ప్రయారిటీ ఇస్తోంది. లాభం లేదనుకున్నాడేమో.. ప్రత్యామ్నాయం చూసుకున్నాడేమో.. వెలుగు పత్రికలో సింగరేణిలో జరుగుతున్న వ్యవహారాల మీద హరీష్ రావు ఒక వ్యాసం రాశారు. ఇది హరీష్ రావు రాశాడా.. ఆయన వ్యక్తిగత కార్యదర్శులు రాసి వెలుగు పత్రికకు పంపారా.. అనే విషయాలను పక్కన పెడితే హరీష్ రావు పేరు మీద ఆ వ్యాసం పబ్లిష్ అయింది.
వెలుగు పేపర్ ఇప్పుడు గడ్డం వివేక్ ది. అతని తండ్రి గడ్డం వివేక స్వామి చివరి వరకు కాంగ్రెస్ లోనే ఉన్నాడు. వివేక్ మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాడు. పైగా సింగరేణి విస్తరించిన ప్రాంతాలు మొత్తం వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లోనివే. పైగా అతని కొడుకు ఎంపీగా ఉన్న ప్రాంతం కూడా సింగరేణినే. హరీష్ రావు రాసిన వ్యాసాన్ని పబ్లిష్ చేసినందుకు నిజంగానే వివేక్ కు అభినందనలు. పాత్రికేయ ధర్మాన్ని కాపాడినందుకు శుభాకాంక్షలు.
అన్నట్టు ఆ మధ్య వి6 వెలుగును బ్యాన్ చేస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ఆ ప్రకటన కేవలం కేటీఆర్ వరకు మాత్రమేనా.. హరీష్ రావుకు వర్తించదా.. లేదా బ్యాన్ ఎత్తేశారా.. ఏమో ఈ ప్రశ్నలకు కేటీఆరే సమాధానం చెప్పాలి.. వెలుగులాగే నమస్తే తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు రాసే వ్యాసాలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఆంధ్రజ్యోతి కూడా వైసిపి నాయకులు రాసే వ్యాసాలకు ప్రాధాన్యం కల్పించాలి. సాక్షి కూడా టిడిపి నేతలు రాసిన వ్యాసాలకు స్పేస్ ఇవ్వాలి. ఈనాడు కూడా వైసిపి నేతలు రాసే ఎడిటోరియల్ కాలమ్స్ పబ్లిష్ చేయాలి.. ఇది గనుక సాధ్యమైతే తెలుగు మీడియాకు మంచి రోజులు వచ్చినట్టే.
