Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్ రావు చేరిక. వాస్తవానికి తాను భారతీయ జనతా పార్టీలో చేరేది లేదని.. తన పుట్టుక.. తన చావు మొత్తం భారత రాష్ట్ర సమితిలో మాత్రమేనని.. తను కెసిఆర్ దళంలో నిబద్ధత కలిగిన సైనికుడిని ప్రతిసారి హరీష్ రావు చెబుతూనే ఉంటారు. అయినప్పటికీ ఆయన మీద వ్యతిరేక ప్రచారం ఆగదు.
ఇటీవల కాలంలో కూడా హరీష్ రావు సిద్దిపేటలో రైతులకు నీళ్లు ఇవ్వాలని పాదయాత్ర చేసినప్పుడు.. దానికి గులాబీ పార్టీ మీడియా అంతగా కవరేజీ ఇవ్వనప్పుడు.. కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయమని స్పష్టం చేశారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల పదే పదే హరీష్ రావు గురించి మాట్లాడుతున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని జోష్యం చెబుతున్నారు. మరోవైపు కల్వకుంట్ల కవిత హరీష్ రావును గుంట నక్క అని విమర్శిస్తున్నారు.
ఈ విమర్శలకు.. ఈ ఆరోపణలకు హరీష్ రావు ఈసారి స్పందించలేదు. కానీ కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ లో ముఖాముఖి నిర్వహించారు. ఇందులో కేటీఆర్ హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరే విషయం మీద క్లారిటీ ఇచ్చారు..” కెసిఆర్ దళంలో నిబద్ధత కలిగిన సైనికుడిగా హరీష్ రావు పనిచేస్తున్నారు. ఆయన గడిచిన పాతిక సంవత్సరాలుగా పార్టీలోనే ఉంటున్నారు. ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి విమర్శిస్తే మేము చెప్పాల్నా. హరీష్ రావు కూడా అనేక సందర్భాల్లో వివరించారు. తన చావు.. కూడా గులాబీ పార్టీలోనేని చెప్పారు. అలాంటప్పుడు ఇంకేం క్లారిటీ ఇవ్వాలి.. ఎందుకివ్వాలి..” అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు..
వీటన్నింటినీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదాహరణలుగా చెబుతూ.. హరీష్ రావు పార్టీ మారబోరని స్పష్టం చేశారు. దీంతో హరీష్ రావు పార్టీ మారే విషయం మీద ఇన్ని రోజులుగా సాగిన ఆరోపణలు వీగిపోయాయి. ఊహగానాలు ఆగిపోయాయి. అయితే ఇటీవల జరిగిన సరూర్నగర్ సభకు సిద్దిపేట ఎమ్మెల్యే ఎందుకు రాలేదు అనే విషయాన్ని ఆ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ అడగలేదు. కేటీఆర్ సమాధానం చెప్పలేదు.








