BRS MLC Kavitha: కల్వకుంట్ల కవితకు కష్టకాలం.. సుప్రీంకోర్టులోనూ షాక్.. నెక్ట్స్ ఏం చేయనుంది?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్‌ అయి.. దాదాపు ఐదు నెలలుగా జైల్లో ఉన్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ తనయ. తాజాగా ఆమె కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Written By: Raj Shekar, Updated On : August 12, 2024 3:30 pm

BRS MLC Kavitha(1)

Follow us on

BRS MLC Kavitha: ఢిల్లీ మధ్యం కుంభకోణంలో ఈఏడాది మార్చి 15న అరెస్ట్‌ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ తనయ ఐదు నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఆమె బెయిల్‌ కోసం అనేక కారణాలతో వేసిన పిటిషన్లను ఇటు రవూస్‌ అవెన్యూ కోర్టు.. అటు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించాయి. దర్యాప్తు సంస్థలు బెయిల్‌ ఇవ్వకూడదని వాదిస్తున్నాయి. దీంతో ఆమె ఇప్పటి వరకు చేసిన బెయిల్‌ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తాజాగా ఆమె ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ దాఖలు చేసిన కేసుల్లో తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ రావడంతో కల్వకుంట్ల కవిత కూడా తనకు బెయిల్‌ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ సర్వోన్నత న్యాయస్థానంలో కూడా ఆమెకు సోమవారం(ఆగస్టు 12న) నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు జస్టిస్‌ గవాయి, జస్టిస్‌ విశ్వనాథన్‌ ధర్మాసనం నిరాకరించింది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

ఐదు నెలలుగా జైల్లోనే..
ఓ ప్రజాప్రతినిధిగా, మహిళ అయిన కవితను ఇంకెంత కాలం జైల్లో ఉంచుతారు అంటూ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటికే బెయిల్‌ పొందిన మనీశ్‌ సిసోడియా, కేజ్రీవాల్‌ కేసులను ఉదహరించారు. అయితే, రోహత్గీ వాదనల సందర్బంగాం కేసు పెట్టిన ఈడీ, సీబీఐలకు తాము నోటీసులు జారీ చేస్తామని జస్టిస్‌ గవాయి స్పష్టంగా చేశారు. దీంతో కనీసం మధ్యంతర బెయిల్‌ అయినా ఇవ్వండి అని కవిత లాయర్‌ రోహత్గీ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు జస్టిస్‌ గవాయి నిరాకరించారు. వారి అభిప్రాయాలను వెల్లడించిన తర్వాతే వాదనలు వింటామని తెలిపారు. అప్పటి వరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేశారు. ఈ లోపు అఫిడవిట్‌ ఫైల్‌ చేయాలని ఈడీ, సీబీఐలకు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే పలు బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ..
ఇదిలా ఉంటే.. ఇప్పటికే కవిత రవుస్‌ అవెన్యూ కోర్టును, ఢిల్లీ హైకోర్టును పలుమార్లు బెయిల్‌ కోసం ఆశ్రయించారు. దర్యాప్తు సంస్థలు బెయిల్‌ ఇవ్వొద్దని వాదించాయి. ఈ స్కాంలో కవితే కీ పిన్‌ అని, ఆమె సాధారణ వ్యక్తి కాదని, బయటకు వస్తే సాక్షాలు తారుమారు చేస్తారని తెలిపాయి. ఇప్పటికే మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని విన్నవించాయి. మహిళ అనే కారణంగా బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, అత్యంత ప్రభావం చూపే వ్యక్తిగా కవితను దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. దర్యాప్తు సంస్థల వాదనలతో కోర్టులు ఏకీభవించాయి. దీంతో బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించాయి.