Governor Kota MLC : తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీల ప్రమాణం.. ఎట్టకేలకు పూర్తయిన గవర్నర్‌ కోటా పదవుల ప్రక్రియ!

తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ దాదాపు ఏడాది తర్వాత ఎట్టకేలకు పూర్తయింది. బీఆర్‌ఎస్‌ హయాంలో జరగాల్సిన నియామకం.. గవర్నర్ తిరస్కరణతో ఆగిపోయింది. కాంగ్రెస్‌ వచ్చాక కోర్టు స్టేతో నిలిచింది.

Written By: Raj Shekar, Updated On : August 16, 2024 1:14 pm

Governor Kota MLC

Follow us on

Governor Kota MLC : తెలంగాణలో గవర్నరక్‌ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీకి 2023లోనే అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. ఈమేరకు క్యాబినెట్‌లో తీర్మానం చేసి గవర్నర్‌ ఆమోదం కోసం పంపించింది. కానీ, గవర్నర్‌ సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టి.. చివరకు సెప్టెంబర్‌ 19న అప్పటి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించారు. దీంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్‌ రావడం, తర్వాత ఎన్నికలు జరగడం, బీఆర్‌ఎస్‌ ఓడిపోవడం జరిగిపోయాయి. డిసెంబర్‌లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా జర్నలిస్‌ అమీర్‌ అలీఖాన్, కోదండరామ్‌ పేర్లను ప్రతిపాదించింది. ఈమేరకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం పంపించగా, నియామకానికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఎమ్మెల్సీల నియామకం జరిగింది. అయితే అలీఖాన్, కోదండరామ్‌ ఎంపికను సవాల్‌ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల పరంగా ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు గవర్నర్‌ చేసిన ప్రకటనను వారు సవాలు చేశారు. దీంతో కోర్టు ప్రొఫెసర్‌ కోదండరామ్, జర్నలిస్ట్‌ అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చింది. దీంతో ప్రమాణ స్వీకారం ఆగిపోయింది.

సుప్రీం కోర్టు తీర్పుతో లైన్‌ క్లియర్‌..
గవర్నర్‌ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం సుప్రీ కోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై విచారణ జరిపిన దేశ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు స్టేను ఎత్తివేసింది. గవర్నర్‌ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించలేమని తెలిపింది. అనంతరం విచారణ వాయిదా వేసింది. దీంతో అమీర్‌ అలీఖాన్, కోదండరామ్‌ ప్రమాణ స్వీకారానికి అడ్డంకి తొలగిపోయింది. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి గరవ్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన ఇద్దరు ఎమ్మెల్యేలతో శుక్రవారం(ఆగస్టు 16న) ప్రనమాణం చేయించారు. వీరి ప్రమాణ స్వీకారానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ హాజరయ్యారు.

కోదండరామ్‌ నేపథ్యమిదీ..
ఉస్మానియా యూనివర్సిటీలో సుదీర్ఘకాలం ప్రొఫెసర్‌గా పనిచేసిన కోదండరాం.. దివంగత ప్రొఫెసర్‌ జయశంకర్, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌ సహా పలువురు ప్రముఖ తెలంగాణ వాదులతో కలిసి పనిచేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీలను ఏకం చేయడంలో చురుగ్గా పనిచేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్‌ ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ విధానాలతో విభేదించారు. ప్రజాస్వామిక తెలంగాణ పేరుతో 2018 మార్చి 31న తెలంగాణ జన సమితి ఆవిర్భవించింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్‌ కాంగ్రెస్‌తో కలిసి పని చేసింది. అదే క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. దీనికి తోడు ఉద్యమ నేపథ్యం, ప్రొఫెసర్‌గా చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.

అమీర్‌ అలీ ఖాన్‌
జర్నలిజంలో విశేష సేవలందించిన అమీర్‌ అలీ ఖాన్‌ (సియాసత్‌ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జాహెద్‌ అలీఖాన్‌ కుమారుడు) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీసీఏ, సుల్తాన్‌–ఉల్‌–ఉలూమ్‌ కాలేజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం సియాసత్‌లో న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. వివిధ అంతర్జాతీయ ఈవెంట్‌లను కవర్‌ చేయడానికి విదేశీ పర్యటనలలో ప్రధానమంత్రి, అధ్యక్షులతో కలిసి ఉన్నారు. మైనారిటీలలో విద్య మరియు నైపుణ్యాలను మెరుగుపరచడానికి, నిరుద్యోగుల కోసం కోచింగ్‌ సెంటర్లను స్థాపించి ఉచిత శిక్షణను అందించారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సియాసత్‌ ఇప్పుడు ఖతార్‌కు విస్తరించింది. 1973, అక్టోబరు 18న హైదరాబాద్‌లో జన్మించిన అమీర్‌ అలీఖాన్‌కు ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, అరబిక్, తెలుగు భాషలు తెలుసు. ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో సాగింది.