HomeతెలంగాణTSPSC New Chairman 2024: టీఎస్.పీఎస్సీ చైర్మన్ గా మాజీ డిజిపి.. మహేందర్ రెడ్డి ఎంపిక...

TSPSC New Chairman 2024: టీఎస్.పీఎస్సీ చైర్మన్ గా మాజీ డిజిపి.. మహేందర్ రెడ్డి ఎంపిక వెనుక కారణమదే

TSPSC New Chairman 2024: పేపర్ లీకులు.. పరీక్షల వాయిదాలు.. ప్రతిపక్షాల ఆందోళనలు.. హైకోర్టులో కేసులు.. సిట్ బృందాల దర్యాప్తులు.. ఇవే కదా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మొన్నటిదాకా జరిగినవి.. అయితే పరిణామాలు కూడా భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోవడానికి కారణమయ్యాయి. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గత ప్రభుత్వం నియమించిన పాలకమండలి రాజీనామా చేయడంతో.. కొత్త పాలక మండలి నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తు ఆహ్వానించింది. దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియడం.. వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పర్యవేక్షించడం.. దానిని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం.. ఆయన దానికి అంగీకారం తెలపడం.. అది గవర్నర్ దగ్గరికి వెళ్లిపోయింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిజిపిగా పనిచేసిన మహేందర్ రెడ్డి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ఆయన దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓకే చేశారని సమాచారం. ఈ చైర్మన్ పదవి కోసం దాదాపు 50 కి పైగా దరఖాస్తులు వచ్చాయి.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలో కమిటీ ఈ దరఖాస్తులు మొత్తం పరిశీలించి మహేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమోద ముద్ర వేయడంతో తదుపరి పరిశీలన నిమిత్తం గవర్నర్ కార్యాలయానికి పంపించారు. లా సెక్రటరీ నిర్మలాదేవి కూడా మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

మహేందర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం. తెలంగాణ రాష్ట్రంలో డిజిపిగా సేవలందించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని అప్పట్లో కోరారు. తన సొంత గ్రామంలో సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. గ్రామ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు. ఇక మహేందర్ రెడ్డి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఎంపిక కావడం లాంచనమే అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రేవంత్ రెడ్డికి గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కు మంచి టర్మ్స్ ఉండటంతో మహేందర్ రెడ్డి నియామకమిషన్లో ఆమె అభ్యంతరం చెప్పకపోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే మహేందర్ రెడ్డి గతంలో కేసీఆర్ అనుకూల వ్యక్తి అని ముద్రపడ్డారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత.. అదే మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమితులవుతుండడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version