Somesh Kumar : కెసిఆర్‌కు సాయం చేసి అడ్డంగా ఇరుక్కున్న ఒక ఐఏఎస్ కథ

పదేళ్ల తరువాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు బిఆర్ఎస్, కెసిఆర్ హయాంలో జరిగిన ఒక్కో అవినీతిని బయటకు తీస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో, గొర్రెల స్కీములో తదితర పథకాల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తూ వస్తున్నారు. అలాగే.. ఇటీవల మరో పెద్ద కుంభకోణం కూడా వెలుగులోకి తెచ్చారు. అదే జీఎస్టీ కుంభకోణం.

Written By: Chai Muchhata, Updated On : September 15, 2024 12:48 pm

Somesh Kumar

Follow us on

Somesh Kumar :  సోమేష్ కుమార్ అంటే రాష్ట్రంలో ఎవరికీ తెలియకుండా ఉండరు. కెసిఆర్‌కు ఎంతగానో నమ్మకస్తుడు. అందుకే ఆయన రిటైర్డ్ అయినప్పటికీ తన ప్రభుత్వంలో మరోసారి నియమించుకున్నారు. ప్రాధాన్యత పోస్టు ఇచ్చి పెద్ద సీటు వేశారు. సీఎస్‌గా బాధ్యతలు అప్పగించారు. సోమేష్ కుమార్ సారథ్యంలో ఉన్న జీఎస్టీలో పెద్ద ఎత్తున కుంభకోణం వెలుగుచూసింది. కెసిఆర్ సాయంబోయి ఆయన ఇరుక్కుపోయినట్లుగా ప్రచారం జరుగుతున్నా.. అంత పెద్ద కుంభకోణాన్ని చూసి తెలంగాణ ప్రజలు ఒకింత ఆశ్యర్యానికి గురికావాల్సి వచ్చింది.

మాజీ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి లేఖతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాంతో విచారణ చేపట్టిన అధికారులు ఈ కేసులో కుంభకోణం జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిర్ధారించారు. రూ.1000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం ఆరోపిస్తోంది. దాంతో ఏ 5గా సోమేష్ కుమార్‌ను చేరుస్తూ కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నట్లు తెలిసింది. సోమేష్ కుమార్‌కు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సోమేష్‌తోపాటు మరికొందరు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ ఎ.శివరాం ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీలు కంపెనీలు ఉన్నాయి.

వస్తువులు సరఫరా చేయకున్నా చేసినట్లు.. ఫేక్ ఇన్వాయిసులు సృష్టించినట్లు.. వాటికి రిటర్న్స్ క్లెయిమ్ చేసినట్లుగా వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారందరిపై కేసులు నమోదయ్యాయి. అయితే.. తప్పుడు ఇన్వాయిస్‌లతో రాష్ట్రానికి రావాల్సిన రూ.1,400 కోట్ల ఆదాయాన్ని పక్కదారి పట్టించారని, ఇందులో సోమేష్ కుమార్ కీలకం అని సీఐడీ గుర్తించింది. అందుకే.. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయిపోయినట్లుగా సమాచారం అందుతోంది.

అయితే.. దీనిపై ఇప్పుడు రాజకీయంగానూ చర్చ జరుగుతోంది. కెసిఆర్‌కు నమ్మిన బంటుగా ఉన్న సోమేష్ కుమార్.. ఆయనకు తెలియకుండానే ఇంతటి అవకతవకలకు పాల్పడ్డారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందా..? కెసిఆర్ ఆర్డర్ లేనిదే ఏ ఫైల్ కానీ, ఏ జీవో కానీ పాస్ కాదని అందరికీ తెలిసిందే. పాలన అంతా కూడా కెసిఆర్ కనుసన్నలోనే జరిగేదనేది బహిరంగ వాస్తవం. అయితే.. జీఎస్టీ విభాగంలో ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నా కెసిఆర్‌కు తెలియకుండా ఉంటుందా అని ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న. అటు మరో వాదన సైతం తెరమీదకు వస్తోంది. కెసిఆర్ కోసమే సోమేష్ కుమార్ ఇలా చేశారని, అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్‌కు సాయం చేసి ఇప్పుడు సోమేష్ కుమార్ ఇరుక్కుపోయారనే ప్రచారం సైతం జరుగుతోంది.