Employees protest no salary hike: “సార్ నమస్కారం. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంటి అద్దెలు కూడా ఎక్కువైపోయాయి. పిల్లల స్కూల్ ఫీజులు భరించలేకపోతున్నాం. బయటికి వెళ్తే చాలు విపరీతమైన ఖర్చు.. ఇక అనారోగ్యానికి గురైతే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బతుకు ఈడ్చడం చాలా కష్టంగా మారింది. ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో మీరు జీతాలు పెంచడమే మా ముందు ఉన్న ఏకైక మార్గం. గడచిన మూడు సంవత్సరాలుగా మాకు వేతనాలు పెంచడం లేదు. అర్ధరాత్రి పూట కొలువులు చేస్తున్నాం. కొన్ని సందర్భాలలో పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడుతున్నాం. ఇలాగైతే మా జీవితం సగంలోనే ముగిసిపోవడం ఖాయం. మా బాధలను దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచండి సార్”
ఇది ఆ పత్రికలో పనిచేస్తున్న పాత్రికేయుల పరిస్థితి. ఇటీవల ఆ సంస్థలో పనిచేస్తున్న పాత్రికేయులు ఎడిటర్ , చైర్మన్ కు లేఖలు రాశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎడిషన్ కేంద్రాల జర్నలిస్టులు మొత్తం ఇలా లేఖలు రాయడంతో ఆ ఎడిటర్.. చైర్మన్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ పత్రికలో వేతనాలు పెంచక దాదాపు మూడు సంవత్సరాలు అయింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పత్రిక యాజమాన్యం పెద్దగా వేతనాలు పెంచలేదు. దీనికి తోడు ఉద్యోగుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చింది.
ఒకానొక దశలో పాలమూరు జిల్లాలో ఉన్న ఎడిషన్ కేంద్రంలో ఉపసంపాదకులు పెన్ డౌన్ చేశారు. ఈ ఉద్యోగం వల్ల కాదంటూ నిరసన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచకపోతే పని చేసేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఆ మేనేజ్మెంట్ ఆ ఉద్యోగులతో మాట్లాడింది. వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ నిరసనలో పాల్గొన్న ఉద్యోగులను బదిలీ చేసింది. ఉదయం లేస్తే చాలు ఆ పత్రికలో అధికార పార్టీ మీద ఇష్టానుసారంగా కథనాలు వస్తాయి. ప్రభుత్వం మీద అడ్డగోలుగా స్టోరీలు పబ్లిష్ అవుతాయి.
గురువింద తనకింది నలుపు చూసుకోదు అన్నట్టుగా.. ఆ పత్రిక యాజమాన్యం తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల క్షేమాన్ని పట్టించుకోదు. కనీసం వేతనాలు పెంచాలని సోయి కూడా ఆ యాజమాన్యానికి లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి వందల కోట్లను అడ్డగోలుగా తీసుకున్న ఆ పత్రిక.. ఇప్పుడు ఉద్యోగులకు వేతనాలు పెంచడంలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రజా సమస్యల మీద ఇష్టానుసారంగా కథనాలను రాసే ఆ పత్రిక.. తన ఉద్యోగుల విషయంలో మాత్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది . అందువల్లే ఉద్యోగులు తట్టుకోలేక లేఖల రూపంలో తమ బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ జీతాలు పెంచాలని సూచించారు. ఉద్యోగుల లేఖల నేపథ్యంలో యాజమాన్యం వేతనాలు పెంచుతుందా.. లేక లేఖలు రాసిన వారిని బదిలీ చేస్తుందా.. చూడాల్సి ఉంది