Daivalaguda Case: షాబాద్ మండలంలో దైవాలగూడలో ఆరుగురుని హత్య చేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. ఇతడి మీద ఫోక్సో కేసు నమోదయింది. ఆ కేసులో బెయిల్ వచ్చే విధంగా సెక్షన్ లు ఉండడంతో రాజ్ కుమార్ పెద్దగా ఇబ్బందులు లేకుండానే బయటికి వచ్చాడు. పైగా ముందస్తుగానే బెయిల్ సంపాదించాడు.. తద్వారా అతడు ఆ బాలికను మరింత వేధించడం మొదలుపెట్టాడు.. ఇవీ మీడియాలో వస్తున్న వార్తలు..
రాజ్ కుమార్ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది. అక్కడి ఎస్ఐ ని సస్పెండ్ చేసింది. సీఐపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అంతర్గత విచారణలో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుంటామని.. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న ఈ ఒక్క పోలీస్ అధికారులు కూడా వదిలిపెట్టబోమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం మీద భారత రాష్ట్ర సమితి నాయకులు తీవ్రస్థాయిలో స్పందించారు.
సబిత ఇంద్రారెడ్డి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… పద్మా దేవేందర్ రెడ్డి.. సత్యవతి రాథోడ్ వంటి నాయకులు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలో హోంశాఖ ఉన్నప్పటికీ.. కనీసం రివ్యూ కూడా చేయలేకపోతున్నారని.. ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి బెయిల్ వెంటనే రావడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇదంతా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల జరుగుతోందని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత బాలికతనపై పెట్టిన ఫోక్సో కేసులో అరెస్ట్ అవకుండా ఉండేందుకు రాజ్ కుమార్ ఏకంగా 20 లక్షలు ఇచ్చాడని సమాచారం. ఆ స్థాయిలో డబ్బు ఇచ్చాడు కాబట్టే పోక్సో కేసులో పోలీసులు కఠినమైన సెక్షన్లను పెట్టలేదు. కేవలం స్టేషన్ బెయిల్ వచ్చే కేసులుమాత్రమే నమోదు చేశారు.
పోలీసుల చేతికి భారీగా డబ్బులు వచ్చాయని అందుకే రాజ్ కుమార్ కు వత్తాసుపలికారని బాలిక బంధువులు చెబుతున్నారు. రాజ్ కుమార్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని చనిపోయిన బాలిక బంధువులు చెబుతున్నారు. పదేపదే చంపుతామని బెదిరిస్తున్నాడని, ప్రాణ భయం ఉందని చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి ఎస్ఐ పై వేటు వేశారు. సీఐపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
