TG Textbooks: ఆ పుస్తకాలు వెనక్కి… రేవంత్‌ తీరుపై విమర్శలు!

రేవంత్‌రెడ్డి పాఠ్య పుస్తకాలను వెనక్కు తీసుకురావాలని ఆదేశించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మారినప్పుడు ఇలాంటివి సహజంగా జరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Written By: Raj Shekar, Updated On : June 15, 2024 3:57 pm

TG Textbooks

Follow us on

TG Textbooks: తెలంగాణలో జూన్‌ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యార్థులు బడిపాట పట్టారు. పాఠశాలల తెరిచే నాటికే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందించాలని నిర్ణయించింది. ఈమేరకు అన్ని పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేసింది. అయితే పంపిణీ చేసిన పుస్తకాల్లో తెలుగు పుస్తకం ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరితోపాటు విద్యాశాఖ కార్యదర్శి జగదీశ్‌ పేర్లు ఉన్నాయి.

ఆ పుస్తకాలు అన్నీ వెనక్కి..
ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన విద్యాశాఖ అధికారులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే పుస్తకాల పంపిణీ నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను రిటర్న్‌ తీసుకోవాలని సూచించింది. ఇలా సుమారు 20 లక్షల పాఠ్య పుస్తకాలను వెనక్కు పంపాలని విద్యాశాఖ ఆదేశించింది. పొరపాటుకు కారణమైన ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ రాధారెడ్డిని సస్పెండ్‌ చేసింది. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇక ఎస్‌సీఆర్టీ పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ రమేశ్‌కు బాధ్యలు అప్పగించారు. తెలంగాణ గురుకుల సొసైటీ కార్యదర్శి రమణకుమార్‌కు ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా నియమించింది.

ప్రభుత్వంపై ఆర్థిక భారం..
రేవంత్‌రెడ్డి పాఠ్య పుస్తకాలను వెనక్కు తీసుకురావాలని ఆదేశించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మారినప్పుడు ఇలాంటివి సహజంగా జరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. దాని కోసం పుస్తకాలను వెనక్కి తెప్పిండాన్ని తప్పు పడుతున్నారు. మళ్లీ ముద్రిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని పేర్కొంటున్నారు.

గతంలో పంపిణీ..
ఇదిలా ఉంటే.. గతంలో ఇలాంటి సందర్భం వస్తే.. పుస్తకాలను వాపస్‌ తీసుకున్న సందర్భం లేదు. అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్‌ అప్పటికే అఖిలేష్‌ యాదవ్‌ ఫొటోతో ముద్రించిన పుస్తకాలను పంపిణీ చేశారు. తాజాగా మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ మాజీ సీఎం జగన్‌ తన ఫొటో ఉన్న పాఠ్య పుస్తకాలే అచ్చు వేశారు. చంద్రబాబు నాయకుడు సీఎం అయినా పుస్తకాలు మాత్రం ఇప్పటికే ముద్రించి ఉండడంతో వాటినే పంపిణీ చేస్తున్నారు.

రేవంత్‌ తీరుపై విమర్శలు..
మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రుల పేర్లు పుస్తకాల్లో ఉన్నాయని పుస్తకాల పంపిణీని నిలిపివేసి వెనక్కు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొందరపాటు నిర్ణయమని పలువురు పేర్కొంటున్నారు. 20 లక్షల పుస్తకాలు కొత్తగా ముద్రించాలంటే భారీగా ఖర్చవుతుందని పేరొకంటున్నారు.