Danam Nagender: ‘దానం’కు కాంగ్రెస్‌ షాక్‌.. సికింద్రాబాద్‌ అభ్యర్థి మార్పు!?

కాంగ్రెస్‌లో గెలుపు గుర్రాలు లేకపోవడంతో బీఆర్‌ఎస్‌లో ఉన్న కీలక నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే దానం నాగేందుర్, రంజిత్‌రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ దక్కించుకున్నారు.

Written By: Raj Shekar, Updated On : March 29, 2024 4:44 pm

Danam Nagender

Follow us on

Danam Nagender: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌లో లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంటు ఎన్నికల్లోనూ రిపీట్‌ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్‌ ఇంకా 14 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

బీఆర్‌ఎస్‌ నేతలకు గాలం..
ఇక కాంగ్రెస్‌లో గెలుపు గుర్రాలు లేకపోవడంతో బీఆర్‌ఎస్‌లో ఉన్న కీలక నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే దానం నాగేందుర్, రంజిత్‌రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ దక్కించుకున్నారు. తాజాగా వరంగల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం కావ్య, ఆమె తండ్రి స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కూడా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించింది.

ఆసక్తికరంగా ‘దానం’ ఎపిసోడ్‌..
ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ టికెట్‌ దక్కించుకున్న దానం నాగేంరద్‌ ఎంపీ టికెట్‌ దక్కించుకోగా, ఇప్పుడు ఆయన ఎపిసోడ్‌ ఆసక్తికరంగా మారుతోంది. అయితే దానం కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం కండీషన్‌ పెట్టింది. కానీ, దానం ఇప్పటికీ రాజీనామా చేయలేదు. మరోవైపు రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి.. జూన్‌ 4న తాను సికింద్రాబాద్‌ ఎంపీగా గెలుస్తానని, తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించడంపై కాంగ్రెస్‌ అధిష్టానం గుర్రుగా ఉంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపి టికెట్‌ అని చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించింది. ఇదే సమయంలో దానంపై కోరుట్లో పిటీషన్లు దాఖలయ్యాయి.

తెరపైకి బొంతు రామ్మోహన్‌..
ఇదిలా ఉండగా, దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ సికింద్రాబాద్‌ అభ్యర్థిని మార్చాలని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేరు తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్‌ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పోటీ చేస్తుండగా, బీఆర్‌ఎస్‌ నుంచి పద్మారావుగౌడ్‌ బరిలో ఉన్నారు. ఈ స్థానం గెలవడం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం అయింది. దీంతో బొంతు రామ్మోమన్‌తోపాటు మరో మాజీ మంత్రి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థి మార్పుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.