Congress Aand MIM: హైదరాబాద్ లో కలిసిపోయిన కాంగ్రెస్, ఎంఐఎం.. ఏంటా స్కెచ్?

అసద్‌ విన్నపం మేరకు హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పోటీ చేయూడదని నిర్ణయించినట్లు తెలిసింది. మొదట ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఫిరోజ్‌ఖాన్‌ను బరిలో దించాలని భావించింది.

Written By: Raj Shekar, Updated On : April 10, 2024 3:31 pm

Congress Aand MIM

Follow us on

Congress Aand MIM: అధికారంలో ఎవరు ఉంటే.. వారికి కొమ్ముకాసే పార్టీ ఎంఐఎం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణ వచ్చాక పదేళ్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా, ఆ పార్టీకి అసోసియేట్‌గా కొనసాగుతూ వచ్చింది. తమ పనుల చేసుకునేందుకు, పాత బస్తీలో జరిగే కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారులు అడుగు పెట్టకుండా ఉండేందుకు ఎంఐఎం ఇలా చేస్తుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఇప్పుడు అసద్‌ భాయ్‌.. ఇప్పుడు హస్తంతో దోస్తీకి సైఅన్నారు. పాత దోస్తు కేసీఆర్‌కు కటీఫ్‌ చెప్పేశారు. ఇక బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కూడా సుస్థిరత కోసం ఎంఐఎంతో దోస్తీకి పచ్చ జెండా ఊపింది.

హైదరాబాద్‌లో ఎంఐఎంకు మద్దతు..
లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మంపై ఇంకా ఎటూ తేల్చడం లేదు. హైదరాబాద్‌లో అసద్‌ను ఢీకొట్టేందుకు ముస్లింనే బరిలో దించాలని భావిస్తోందని ప్రచారం జరిగింది. ఇప్పటికే బీజేపీ మాధవీలతకు టికెట్‌ ఇచ్చింది. ఆమె పాతబస్తీకి చెందిన నేత కావడంతో ఎంఐఎం అధినేతలో టెన్షన్‌ మొదలైంది. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కూడా అభ్యర్థిని నిలిపితే తన ఓటు బ్యాంకు దెబ్బతినడంతోపాటు బీజేపీ అభ్యర్థి గెలుస్తుందని లెక్కలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పోటీ చేయకుండా చాలా రోజులుగా ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో అసద్‌ కోరిక మేరకు ఎంఐఎంపై పోటీ చేయకూడాదని కాంగ్రెస్‌ నిర్ణయించింది. అసద్‌కు మద్దతు ఇవ్వాలని డిసైడ్‌ అయినట్లు హస్తం నేతలు తెలిపారు.

ఎంఐఎం కంచుకోటగా..
హైదరాబాద్‌ ఎంపీ స్థానం ఎంఐఎంకు కంచుకోటగా ఉంది. 1989 నుంచి 2019 వరకు ఇక్కడ ఎంఐఎం వరుసగా గెలిచింది. అంతకుముందు అసద్‌ తండ్రి సలావుద్దీన్‌ ఒవైసీ గెలవగా, ఇప్పుడు అసదుద్దీన్‌ విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలో 35 ఏళ్ల మస్లిస్‌ ఆధిపత్యానికి గండి కొట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకు ఇక్కడి నుంచి పాత బస్తీకే చెందిన కరుడుగట్టిన హిందూ వాది అయిన విరించి ఆస్పత్రుల చైర్‌పర్సన్‌ మాధవీలతను బరిలో దించింది. ఇప్పటికే పాత బస్తీలో అసద్‌ కుటుంబంపై, ఎంఐఎంపై వ్యతిరేకత పెరిగింది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్‌ కూడా అభ్యర్థిని నిలిపితే అది బీజేపీకే లాభం జరుగుతుందని ఎంఐఎం అధినేత భావించారు. దీంతో మజ్లిస్‌ ఆధిపత్యానికి చెక్‌ పడుతుందని గుర్తించి.. కేసీఆర్‌కు కటీఫ్‌ చెప్పి.. హస్తంతో నేస్తానికి సై అన్నాడు.

పోటీకి కాంగ్రెస్‌ వెనుకడుగు..
అసద్‌ విన్నపం మేరకు హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పోటీ చేయూడదని నిర్ణయించినట్లు తెలిసింది. మొదట ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఫిరోజ్‌ఖాన్‌ను బరిలో దించాలని భావించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్‌ఖాన్‌ ఓడిపోయారు. దీంతో హైదరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో అసదుద్దీన్‌పై పోటీకి సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్, ఎంఐఎం మధ్య డీల్‌ కుదరడంతో ఫిరోజ్‌ఖాన్‌ ఇక పోటీ చేసే అవకాశం లేనట్లే అని తెలుస్తోంది.

గత ఎన్నిల్లో ఇలా..
2019 లోక్‌సభ ఎన్నికల్లో అసద్‌ కి 5,17, 471 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి భగవంతురావుకి 2,35,285 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఫిరోజ్‌ ఖాన్‌కు 49,944 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుస్తె శ్రీకాంత్‌కు 63,239 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్ధులు, నోటాకు కలిపి 15 వేల ఓట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఈసారి ఫిరోజ్‌ఖాన్‌ను బరిలో దింపితే తనకు గడ్డు పరిస్థితి తప్పదని అసద్‌ ఊహించారు. ఎంపీగా తన గెలుపు ఓటములు కాంగ్రెస్‌ చేతిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంకేముంది వెంటనే కాంగ్రెస్‌ శరణు కోరారని చర్చ జరుగుతోంది. శరణు కోరిన వాడిని చంపొద్దని సూత్రం మేరకు హైదరాబాద్‌లో అభ్యర్థిని పోటీకి పెట్టకూడదని సీఎం రేవంత్‌ నిర్ణయించారని తెలిసింది.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వీరే..
ఇక లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ నుంచి పోటీ చేసే బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. బీజేపీ విరించి హాస్పిటల్‌ అధినేత్రి మాధవీలత బరిలోకి దించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. అధికార కాంగ్రెస్‌ క్యాండిడేట్‌ ఎంపిక కోసం మల్లగుల్లాలు పడింది. కాంగ్రెస్‌ జాప్యం వెనుక అసదుద్దీన్‌ ఉన్నారని జరిగిన ప్రచారం నిజమైంది. హైదరాబాద్‌లో అసద్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఫీరోజ్‌కాన్‌ ప్రకటించారు. నాలుగు పార్టీలు పోటీలో ఉంటే.. తన గెలుపు కష్టమని అసద్‌ కాంగ్రెస్‌తో దోస్తీ కట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

బీజేపీకి చెక్‌ పెట్టాలని..
లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి హైదరాబాద్‌లో బాగా పుంజుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం ఓట్లకు గండి పడడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే అసద్‌ పాత బస్తీలో కాషాయ జెండా ఎగరకుండా కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేయాలన్న ప్రతిపాదనను రేవంత్‌రెడ్డి ముందు ఉంచారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు బీజేపీని ఓడించేందుకు అసద్‌ ప్రతిపాదనకు రేవంత్‌ ఓకే చెప్పారని సమాచారం.