Telangana Politics : టార్గెట్ రేవంత్.. తెలంగాణలో మారుతున్న ఈక్వేషన్లు.. ఎమ్మెల్యేలు యూటర్న్

కెసిఆర్ పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారు రోజులు గడవక ముందే మాతృ పార్టీలోకి వస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 31, 2024 11:03 am
Follow us on

Telangana Politics  : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు చేరికలతో జోష్ మీద ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ.ఇక కెసిఆర్ పార్టీ నిర్వీర్యమే అన్నంత రేంజ్ లో రాజకీయం నడిచింది. కోలుకోలేని దెబ్బ తగిలిందని..కెసిఆర్ కోలుకోవడం కష్టమని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో తిరిగి చేరికలు పెరగడం అధికార పార్టీని కలవరపరుస్తోంది. తెర వెనుక ఏం జరుగుతుందో తెలియక అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సతమతమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కంటే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని సరికొత్త రాజకీయ క్రీడకు తెర తీసినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది కూడా కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులకు గేట్లు ఎత్తారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు పది మంది ఎమ్మెల్యేలు, అదే స్థాయిలో ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ లో ఒక రకమైన చేంజ్ కనిపించింది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకపోవడంతో.. ఇక ఆ పార్టీ భవిష్యత్తు లేదని ఆందోళన చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరిన చాలామంది ఎమ్మెల్యేలు అక్కడ ఇమడలేకపోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కెసిఆర్ సైతం రాజకీయ పావులు కదపడంతో.. చాలామంది ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే తిరిగి బిఆర్ఎస్ గూటికి చేరగా.. మరో ముగ్గురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం మాతృ పార్టీ వైపు ఆశగా చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయం సరికొత్త పుంతలు తొక్కుతోంది.

* హేమా హేమీలు జంప్
బిఆర్ఎస్ నుంచి హేమాహేమీలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. గతంలో పార్టీలో కీలక పదవులు అనుభవించిన వారు సైతం కాదనుకొని వెళ్లిపోయారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పఠాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకమునుపే ఫిరాయింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం పై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయినా కాంగ్రెస్ నాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు.

* తిరిగి మాతృ పార్టీలోకి
అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకుంటున్నారు. అక్కడ వాతావరణానికి ఇమడలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ కాలం పాటు అక్కడ కొనసాగలేమని భావిస్తున్నట్లు సమాచారం. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే యూటర్న్ తీసుకున్నారు. కేటీఆర్ తో సమావేశమై బిఆర్ఎస్ లో కొనసాగుతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.ఆయనతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్ కుమార్ సొంత గూటికి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.

* కాంగ్రెస్ లో భిన్న వాతావరణం
వాస్తవానికి కాంగ్రెస్ లో భిన్న పరిస్థితి ఉంది. బయటకు కనిపిస్తున్నంత సానుకూల వాతావరణం మాత్రం అక్కడ లేదు. ఆధిపత్యం కొనసాగుతోంది. ముఖ్యంగా సీనియర్ నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. జిల్లాలో సైతం పార్టీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదు. ఎమ్మెల్యేలు చేరుతున్న నియోజకవర్గాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకత్వం వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు కొద్ది రోజులకే దూరమవుతున్నారు. ఇది అంతిమంగా సీఎం రేవంత్ రెడ్డి చరిష్మ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.