KTR vs Revanth : రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మరో పెద్ద బాంబు పేల్చిన కేటీఆర్.. కేంద్రానికి ఫిర్యాదు.. సంచలన ట్వీట్ వైరల్

తెలంగాణలో రాజకీయాలు అంతకంతకు వేడివేడిగా మారుతున్నాయి. రేవంత్ వర్సెస్ కేటీఆర్ ఆరోపణలు ప్రతి ఆరోపణలు మీడియాకు కావలసినంత మసాలా ఇస్తున్నాయి..

Written By: Anabothula Bhaskar, Updated On : September 23, 2024 7:56 pm

KTR vs Revanth

Follow us on

KTR vs Revanth : :  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కుంభకోణాలు జరిగాయని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి అమెరికా వెళ్లి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో స్వచ్ఛ్ బయో అనే కంపెనీ కూడా ఉంది. అయితే ఈ కంపెనీ ముఖ్యమంత్రి సోదరుడికి చెందిందని.. దానికి భారీగా వ్యాపారం నిర్వహించే స్థాయి లేదని.. ఉద్యోగాలు ఇచ్చే అర్హత లేదని .. తెరపైకి సంచలన విషయాలను తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బంది కలిగించడంతో కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాల వివరాలను జయేశ్ రంజన్ విలేకరుల ఎదుట చెప్పాల్సి వచ్చింది. అయితే ఇదే సమయంలో ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ.. నాడు కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భువి బయో కెమికల్స్, ధాత్రి సిలికేట్స్ కంపెనీల వ్యవహారాలను వెలుగులోకి తెచ్చింది. దీంతో ఈ పంచాయితీ అటు కాంగ్రెస్, ఇటు భారత రాష్ట్ర సమితి మధ్య కొద్ది రోజులపాటు జరిగింది. ఆ తర్వాత హైడ్రా వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ విషయాలు మొత్తం పాతవి అయిపోయాయనుకుంటా.. ఇప్పుడు కొత్తగా అమృత్ పథకానికి సంబంధించిన కాంట్రాక్టుల వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే ఇందులో పనులను ముఖ్యమంత్రి బావమరిది (సతీమణి సోదరుడు) సూదిని సృజన్ రెడ్డికి కేటాయించారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారని స్పష్టం చేశారు. దమ్ముంటే దర్యాప్తు జరిపించాలని, సీజే దగ్గరికి వెళ్దామని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నైనా ఆశ్రయిద్దామని కేటీఆర్ సవాల్ చేశారు. అంతకుముందు ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. అమృత్ పథకంలో అవినీతి జరిగిందని చెబితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పొంగులేటి సవాల్ విసిరారు. పొంగులేటి సవాల్ విసిరిన ఒక్కరోజు తర్వాత కేటీఆర్ మీడియా ముందుకు వచ్చారు.

రాజకీయ సన్యాసం చేస్తా

అమృత్ పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని.. రేవంత్ రెడ్డి తన సొంత బామ్మర్ది కి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారం రేవంతం మెడకు చుట్టుకుంటుందని హెచ్చరించారు.. “సృజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయాన బావమరిది. ఆయన కంపెనీకి రెండు కోట్ల లాభం మాత్రమే ఉంది. అలాంటి కంపెనీకి వెయ్యి కోట్ల కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారు? ఇలా ఎందుకు చేశారు? ఇందులో అవినీతి లేదని చెబితే ఎవరైనా నమ్ముతారా” అని కేటీఆర్ ఆరోపించారు.. తప్పని ఒప్పుకొని టెండర్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.”రేవంత్ టెండర్లను రద్దు చేయని పక్షంలో సోనియా గాంధీ, అశోక్ చవన్, యడ్యూరప్ప మాదిరిగా పదవులను కోల్పోవాల్సి ఉంటుందని” కేటీఆర్ అన్నారు.. కేటీఆర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. కేటీఆర్ కు ధీటుగా సమాధానాలు ఇస్తోంది.