HomeతెలంగాణBRS: ఫైటింగ్ తో ఫామ్ లోకి బీఆర్ఎస్.. అవకాశం ఉన్నా కామ్ గా...

BRS: ఫైటింగ్ తో ఫామ్ లోకి బీఆర్ఎస్.. అవకాశం ఉన్నా కామ్ గా బీజేపీ..

BRS: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక దశలో బీజేపీ భూంకు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా? అన్న అనుమానాలు కలుగకపోలేదు! ‘మా ఎమ్మెల్యే పోయినా కేసీఆర్ ఉంటే చాలు’అనుకున్న ప్రజల ఆలోచనలకు తోడు స్వయంకృతాపరాధాలు, కొందరు ఎమ్మెల్యేల తీరుతో బీఆర్ఎస్ ఓడిపోయి అనూహ్యంగా కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఆరు గ్యారెంటీలు.. ఎన్నెన్నో హామీలు, ‘మార్పు’అంటూ అన్నివర్గాల ఓటర్లను ఆకట్టుకున్నది. ప్రజాపాలన అంటూ ఊదరగొట్టి తీరా తొమ్మిది నెలల్లోనే ప్రజావ్యతిరేతను ఎదుర్కొంటున్నది. ఒంటెద్దు చేలో పడ్డట్టు రేవంత్రెడ్డి తీరుతోనో.. అనాలోచిత నిర్ణయాల వల్లనో గాని మొన్నటిదాకా కాంగ్రెస్ సర్కార్ తీరుపై ‘చూద్దాం.. ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చింది’ అన్న ఆలోచనలో ఉన్నవారంతా ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారు. ఓవైపు అరకొర రుణమాఫీ, రైతు భరోసా ఊసులేకపోవడం, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చకపోవడంపై ఆయా వర్గాల ప్రజలు గుర్రుగా ఉంటే.. కొన్ని రోజులుగా హైడ్రా, మూసీ డెవలప్మెంట్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకంపై అందరిలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పేరిట పేదల ఇండ్లను కూలదోసి వారిని రోడ్డున పడేయడం, మరోవైపు పెద్దల కట్టడాలకు కేవలం నోటీసులతో సరిపెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలతో ముందుకు పోతున్న రేవంత్రెడ్డికంటే ‘కేసీఆరే బెటర్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరిట పేదల నివాసాలను కూల్చడం, తమ ఇంటిని ఎక్కడ కూల్చుతారోనని ఓ మహిళా బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశమైంది. హైడ్రాతో సాగుతున్న బుల్డోజర్ రాజ్యంపై బీఆర్ఎస్ జంగ్ మొదలుపెట్టింది. నిరుద్యోగుల సమస్యలు, రుణమాఫీ, గురుకులాల సమస్యలు ఇలా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా `చే`జిక్కించుకొని పోరాటం చేస్తున్నది. తెలంగాణ భవన్ తలుపులు తెరిచి హైడ్రా, మూసీ పరీవాహక బాధితులకు భరోసా కల్పిస్తున్నది. శాంతి భద్రతల నుంచి ప్రస్తుత హైడ్రా కూల్చివేతల దాకా ప్రతి అశంపైనా బీఆర్ఎస్ గట్టిగా గళం వినిపిస్తున్నా.. ఎందుకో బీజేపీ మాత్రం వెనుకబడి పోయినట్టు కనిపిస్తున్నది. హైదరాబాద్ నగరంలో బీజేపీ కార్పొరేటర్లు ఎక్కువే ఉన్నా దూకుడు మాత్రం కనిపించడం లేదు. బీజేపీ తరు కేంద్రంలో ఒకలా.. రాష్ట్రంలో ఒకలా ఉన్నదని బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ఆ పార్టీయే అవకాశం ఇస్తున్నది. సీఎం రేవంత్రెడ్డికి బీజేపీ అధిష్టానం అండ ఉన్నదనే ఆరోపణలకు ఆ ఇటీవలి పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి.

బీజేపీ నుంచి ఒక్క ఏలేటి మహేందర్రెడ్డి తప్ప వేరే ఎవరూ కాంగ్రెస్ సర్కార్ను విమర్శించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. బీజేపీకి సరైన సారథి లేక పోవడం వల్లా కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోలేకపోతున్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి పాలనపై , మంత్రుల శాఖలపై పట్టు లేకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన అడ్డగోలు హామీలను అమలు చేసే పరిస్థతి లేకపోవడం, ఈ క్రమంలో లక్షన్నర కోట్లతో మూసీని అభివ్రుద్ధి చేస్తామని కంకణం కట్టుకోవడం, మూసీ పరివాహక ప్రాంత ప్రజలపై కూల్చివేతల కత్తులు నూరడం, ఇప్పటికే హైడ్రా సాగించిన కూల్చివేతల సందర్భంగా బాధితల ఆర్తనాదాలు, ఏడుపులు, పెడబొబ్బలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వంపై ప్రజలో్ల అప్పుడే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నీటివనరుల ఎఫ్టీఎల్ పరిధుల్లో పెద్దల ఆవాసాలు, బహుళ అంతస్థులను వదిలేసి, పేదల ఇండ్లను కూల్చివేస్తున్నతీరు జనంలో వ్యతిరేకత పెంచుతున్నది. కాంగ్రెస్ పార్టీ కర్యకర్తలు, నాయకుల్లోనూ రేవంత్ రెడ్డి తీరుపై అసంత్రుప్తి పెరుగుతున్నట్టు తెలుస్తున్నది.

పాలనా వ్యవహా రాలపై పట్టున్న బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్రావు, మాజీ మంత్రులు కాంగ్రెస్ సర్కార్ ను వీలు చిక్కినప్పు డల్లా డిఫెన్స్ లో పడేస్తున్నారు. బీజేపీకి వివిధ అంశాలపై అవగాహన లేకనో.. లేదా ఎందుకులే అన్న నిర్లిప్తతనో.. హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలో.. లేక రేవంత్ రెడ్డితో ఉన్న అంతర్గత ఒప్పందాల వల్లనో తెలియదుగానీ ఎవరూ పెద్దగా నోరు మెదపడం లేదు. గతంలో బండి సంజయ్ సారథిగా ఉన్న సమయంలో ఆయన దూకుడు స్వభావంతో పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగినా ఇప్పుడు ఆయనలా ఫైట్ చేసే నాయకులు బీజేపీలో కనిపించడం లేదు. పైగా బండి సైతం ఒక సందర్భంలో ఒకరినొకరు తిట్టుకోకుండా ముందుకుపోదామని కాంగ్రెస్కు బహిరంగంగానే సూచనలు చేశారు. ఇక బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సర్కార్ కు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా అది కిషన్ రెడ్డి డైరక్షన్ లోనే నని అధిష్టానం భావిస్తుందని సీనియర్లు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. మొత్తంగా హైడ్రా కూల్చివేతలతో బీఆర్ఎస్కు హైప్ వస్తుంటే బీజేపీ మాత్రం ఎందుకు డీలా పడిందనే చర్చలు నడుస్తున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular