CM Revanth Reddy: కొత్త ముఖ్యమంత్రి ముందు కొంగొత్త సవాళ్లు..

రేవంత్‌రెడ్డి ముందు ముఖ్యమంత్రిగా అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే సీనియర్లు జూనియర్లు , కొత్త, పాత మధ్య గ్యాప్‌ ఉంది. మంత్రివర్గ కూర్పు పెద్ద సవాల్‌.

Written By: Raj Shekar, Updated On : December 6, 2023 11:40 am

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణ ప్రజలు అధికార బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను గద్దెనెక్కించారు కాంగ్రెస్‌ అధిష్టానం ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని ప్రకటించింది. రేపు సీఎంగా రేవంత్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ వెళ్లిన రేవంత్‌ తన ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతోపాటు, ఏఐసీసీ పెద్దలను ఆహ్వానించారు. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రమాణం చేయనున్నారు.

రేవంత్‌ ముందు సవాళ్లు..
రేవంత్‌రెడ్డి ముందు ముఖ్యమంత్రిగా అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే సీనియర్లు జూనియర్లు , కొత్త, పాత మధ్య గ్యాప్‌ ఉంది. మంత్రివర్గ కూర్పు పెద్ద సవాల్‌. సామాజికవర్గాలు, ప్రాంతాలు, చూడాల్సిన అవసరం ఉంది. అయితే సీనియర్లు మంత్రివర్గంలో ఉండవలసిన వారు అనేక మంది ఉన్నారు. ఎవరిని కాదన్నా వారికి కోపం వస్తుంది. జంబో మంత్రివర్గాన్ని తీసుకుందామన్న కుదరదు. రాష్ట్రలో ఉన్న శాసనసభ్యుల సంఖ్య ప్రకారం ముఖ్యమంత్రితో సహా 18 మందికే అవకాశం ఉంది. దీంతో కూర్పు తలనొప్పితో కూడు కున్నదే.

అనుభవ లేమి..
ఇక రేవంత్‌ ఇప్పటివరకు కనీసం మంత్రిగా కూడా పనిచేయలేదు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. పరిపాలన అనుభవం లేదు. అందువల్ల సలహాదారులు, అధికారులపై కొంతకాలం ఆధారపడక తప్పని పరిస్థితి.

ఆర్థిక పరిస్థితి అంతంతే..
ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఇప్పటికే ఉద్యోగులకు ,పెన్షనర్లకు జీతం ప్రతినెలా మొదటి తేదీనే ఇవ్వాల్సి ఉండగా రెండవవారం, మూడవవారంలో గానీ ఇవ్వడంలేదు. కనీసం మొదటివారంలో ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. అంతే కాకుండా డీఏ బకాయిలు విడదల చేయకపోవడం, పీఆర్సీ రాకముందు ఇచ్చే ఐఆర్‌ ప్రకటనపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి.

హామీల అమలు..
ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రైతు బంధు ఇవ్వాలి. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న హామీ మేరకు యాసంగి పంటకు ఎకరాకు రూ.7,500 ఇవ్వాలి. మహిళకు రూ.2500 ఇస్తామన్నారు. అదే విధంగా పెన్షనర్లకు 4 వేల రూపాయల వాగ్దానాలు ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 24 గంటలు ఉచిత విద్యుత్‌ , ఇందిరమ్మ ఇల్లు , ఇంటికి 5 లక్షలు సహాయం , ఉద్యమకారులకు 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి నిధులు లాంటి వాగ్దానాలు ఉన్నాయి. రాష్ట్రంపై రూ.5.5 లక్షల కోట్ల అప్పు ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. దీంతో కేంద్రంతో సఖ్యత కొనసాగిస్తూ నిధులు తెచ్చుకోవాలి. కేంద్రం ఏమేరకు సహకరిస్తుంది అన్నది అనుమానమే.