HomeతెలంగాణBandi Sanjay: సంజయ్‌కే సారథ్య బాధ్యతలు.. బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం?

Bandi Sanjay: సంజయ్‌కే సారథ్య బాధ్యతలు.. బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం?

Bandi Sanjay: భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏడాదిన్నగా తాత్కాలిక అధ్యక్షుడు కొనసాగుతున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్టానం బండి సంజయ్‌ను తప్పించి కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బాగా నష్టపోయింది. ఎన్నికల తర్వాత ఈవిషయం అర్థమైంది. దీంతో ఎన్నికల తర్వాత నూతన అధ్యక్షుడిని నియమిస్తారని అంతా భావించారు. కానీ, ఇప్పటికీ కిషన్‌రెడ్డే కొనసాగుతున్నారు. ప్రస్తుతం అన్ని ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొత్త సారథి ఎంపిపై అధిష్టానం దృష్టి పెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనే నేత కోసం కమల నాథులు వెతుకుతున్నారు. 2019 నుంచి 2023 వరకు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్‌ను ఢీకొని బీజేపీకి మంచి ఊపు తెచ్చారు బండి సంజయ్‌ దీంతో ఆయన అయితేనే ప్రస్తుత కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించే అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అయితే తెలంగాణ బీజేపీ పగ్గాల కోసం బీసీ కోటాలో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌ పోటీ పడుతున్నారు. మరోవైపు మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే అధిష్టానం మాత్రం సంజయ్‌ అయితేనే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

గత ఫలితాల ఆధారంగా..
2019 నుంచి 2023 వరకు బండి సంజయ్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలో బీజేపీ క్షేత్రస్థాయికి వెళ్లింది. గతంలో కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన బీజేపీని గ్రామస్థాయికి తీసుకెళ్లిన ఘటన సంజయ్‌దే. గతంలో అధ్యక్షులుగా దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పనిచేశారు. వీరంతా హైదరాబాద్‌కే పరిమితమయ్యేవారు. విమర్శల ధాటి కూడా తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో బీజేపీ 2019లో కేసీఆర్‌కు దీటుగా సమాధానం చెప్పే నేత కోసం గాలించి బండికి పగ్గాలు అప్పగించింది. అధిష్టానం అంచనాలకు తగినట్లుగా సంజయ్‌ కూడా పనిచేశారు. రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ను ఉప ఎన్నికల్లో గెలిపించారు. తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి 40కిపైగా స్థానాల్లో గెలిచేలా కృషి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో బీజేపీకి మంచి ఊపు రావడానికి కారణం సంజయ్‌. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన పదవీకాలం ముగిసింది. ఎన్నికల వరకు ఆయననే కొనసాగించాలని అధిష్టానం భావించింది. కానీ, కొంత మంది నేతలు సంజయ్‌సారథ్యంలో పనిచేయడానికి అంగీకరించలేదు. అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్టానం సంజయ్‌ను తప్పించి కిసన్‌రెడ్డిని నియమించింది. ఈ అనూహ్య నిర్ణయంతో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో బాగా నష్టపోయింది.

రేసులో వీరు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాల కోసం ప్రస్తుతం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎంపీలు అరవింద్, రఘునందన్‌రావు, డీకే అరుణ, ఈటల రాజేందర్‌ ఉన్నారు. అయితే బండి సంజయ్‌పై ఉన్న నమ్మకంతో కమలం పెద్దలు ఆయన అయితేనే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నారు. అయితే సంజయ్‌ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించి ఈటల రాజేందర్‌కు పదవి ఇస్తారని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని మార్చాలని కమలనాథులు ఆలోచన చేస్తున్నారు. 2029 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేసే నేత సంజయ్‌ మాత్రమే అన్న ఆలోచనలో అధిష్టానం ఉంది. అందుకే సంజయ్‌నే సారథి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ బలం పెంచేందుకు, మరింత పోటీ పెంచేందుకు సంజయ్‌ కావాలని పెద్దలు భావిస్తున్నారు.

రేసులో లేనన్న సంజయ్‌..
ఇదిలా ఉంటే… తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో తాను లేనని బండి సంజయ్‌ ఇటీవలే తెలిపారు. తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని తెలిపారు. తెలంగాణ పగ్గాలు తనకు ఇస్తారనేది ఊహాగానాలే అని చెప్పారు. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. హైకమాండ్‌ అధ్యక్షుడిని నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ తరుణంలో బీజేపీ సారథి సంజయ్‌ అవుతారా లేదా అనేది వేచి చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular