CM Revanth Reddy
CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే బడ్జెట్, రైతు రుణమాఫీ, స్కిల్ యూనివర్శిటీ వంటి బిల్లులకు ఓకే చెప్పిన సీఎం.. తాజాగా స్పోర్ట్స్ పాలసీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా స్ట్రోర్స్ పాలసీని తీసుకువస్తామని ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. మరోవైపు.. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మస్తామని తెలిపారు. దీంతోపాటు.. ప్రతి మండల కేంద్రంలో ఒక మినీ స్పోర్ట్స్ స్టేడియంను నిర్మించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ శివారులోని కందుకూరు మండల పరిధిలోని బేగరికంచలో అంతర్జాతీయస్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించున్నట్టు తెలిపారు. ఉమ్మడి గచ్చిబౌలి స్టేడియంలో వివిధ రకాల క్రీడలు నిర్వహించామన్నారు. పుల్లెల గోపీచంద్ అకాడమీకి స్థలం ఇచ్చామన్నారు. తద్వారా అకాడమీ నుంచి చాలా మంది క్రీడాకారులు తయారయ్యారని చెప్పుకొచ్చారు. ప్రైవేటు అకాడమీలు కాకుండా ప్రభుత్వం తరపున శిక్షణ ఇస్తే అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకోసమే ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా క్రీడల కోసం రూ.361 కోట్లు కేటాయించినట్టు రేవంత్ రెడ్డి వివరించారు. మరోవైపు.. ఉన్నత చదువులు చదివించే క్రమంలో.. పిల్లలను క్రీడలకు దూరం చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి. ఆటల్లో కూడా రాణించాలని.. తద్వారా కూడా ఉద్యోగాలు వస్తాయని.. ఉపాధి దొరుకుతుందని.. కుటుంబానికి గౌరవం కూడా లభిస్తుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకే నిఖత్ జరీన్కు, సిరాజ్కు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించినట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేవలం ఉద్యోగాలే కాదు.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో 600 గజాల చొప్పున ఇంటి స్థలం కూడా కేటాయించామని తెలిపారు.
క్రీడాకారులకూ ఉద్యోగాలు..
చదువులో రాణించడంతోపాటు ఆటల్లోనూ రాణిస్తే ఉద్యోగాలు ఇంకా సులభంగా దొరుకుతాయని సీఎం తెలిపారు. ఇంటర్ పాసైన సిరాజ్కు విద్యార్హతలో మినహాయింపు ఇచ్చి ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామని ప్రకటించారు. ఈ అంశంలో వివిధ రాష్ట్రాల్లో స్టడీ చేసి సమాచారం సేకరించామన్నారు. హరియాణాలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నారని వివరించారు. అందుకే.. హారియాన, పంజాబ్ రాష్ట్రాలను అనుసరించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వచ్చే సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని ప్రకటించారు.
బీసీసీఐతో చర్చలు..
ఇక రాష్ట్రంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం బీసీసీఐతో మాట్లాడుతున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రాథమిక చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. బేగరికంచెలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి భూమి కేటాయిస్తామన్నారు. క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ ముందుకు వచ్చిందని తెలిపారు. మరోవైపు.. ప్రతీ మండల కేంద్రంలో ఒక మినీ స్పోర్ట్స్ స్టేడియం నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రాంతానికి న్యాక్ను బదిలి చేస్తామని తెలిపారు. క్రీడల విషయంలో నిధుల కేటాయింపుతోపాటు త్వరలోనే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో యువతను వ్యసనాల నుంచి బయటకు తీసుకురావాలంటే క్రీడలను ప్రోత్సహించాలని తెలిపారు. స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు.