Bhadradri Kothagudem: సాప్ట్ వేర్ భర్తతో బెట్టింగ్ వ్యసనం మానిపించలేక.. కన్నీళ్లు పెట్టిస్తున్న భార్య కఠిన నిర్ణయం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన పాటిబండ్ల ప్రశాంత్ వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇతడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ కు చెందిన అడపా మృదుల (38) తో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

Written By: Bhaskar, Updated On : May 10, 2023 1:58 pm
Follow us on

Bhadradri Kothagudem: ఒకరు చేసిన తప్పుకు ఒక కుటుంబమే బలైంది. నువ్వు మారు అని ఆ ఇల్లాలు ఎన్నిసార్లు చెప్పినా అతడు అలాగే ఉండడం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. సమాజంలో పెడపోకడలు ఎంతటి ఉత్పాతాన్ని సృష్టిస్తాయో కళ్ళకు కట్టింది.. అంతేకాదు వ్యసనాలకు బానిసలు అయిన వ్యక్తుల వల్ల కుటుంబాలు ఎంతటి నరకం చూస్తాయో చాటి చెప్పింది.

బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన పాటిబండ్ల ప్రశాంత్ వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇతడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ కు చెందిన అడపా మృదుల (38) తో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం ప్రశాంత్ మృదులను అమెరికా తీసుకెళ్లాడు. అక్కడ ప్రశాంత్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేసేవాడు. అక్కడే మృదుల, ప్రశాంత్ దంపతులకు ప్రజ్ణాన్(8) జన్మించాడు. తర్వాత ప్రశాంత్, మృదుల దంపతులు స్వదేశానికి వచ్చారు. హైదరాబాదులోనే ఉంటూ ప్రశాంత్ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. వారు ఇండియాకి వచ్చిన తర్వాత మహాన్(5) కుమారుడు జన్మించాడు.. అయితే ప్రశాంత్ చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినప్పటికీ.. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడేవాడు.. దీనివల్ల లక్షల్లో డబ్బులు కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయాడు. కంపెనీ ఇచ్చిన టాస్కులు కూడా పూర్తి చేయకపోవడంతో వేతనం కూడా అంతంతమాత్రంగా వచ్చేది. దీంతో ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. బయట తీసుకొచ్చిన అప్పులు తీర్చేందుకు డబ్బులు కావాలని, అందుకు మీ పుట్టింటి వారి నుంచి తీసుకురావాలని మృదులను ప్రశాంత్ వేధించడం మొదలుపెట్టాడు.. ఆమెను శారీరకంగా హింసించడం ప్రారంభించాడు.. అయితే ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో.. అప్పట్లో మృదులకు వరకట్నం కింద 7 ఎకరాల జీడి తోట ఇచ్చారు.. అయితే కూతురు డబ్బులు అడుగుతుండడంతో ఆ జీడి తోటను అమ్మకానికి పెట్టారు. అయితే ఆ అమ్మకం ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో ప్రశాంత్ లో అసహనం మరింత పెరిగిపోయింది. దీంతో మృదులను మరింత వేధించడం మొదలుపెట్టాడు.

శుభకార్యానికి వెళ్లి..

ప్రశాంత్ వేధింపుల పర్వం కొనసాగుతుండగానే… పిల్లలకు సెలవులు రావడంతో మనశ్శాంతి కోసం మృదుల తన పుట్టినిల్లు అయిన ముష్టిబండకు వెళ్ళింది.. వెళ్తూ తన పిల్లలను కూడా తనతో పాటు తీసుకెళ్లింది. ముష్టిబండలో తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరైంది.. అనంతరం విజయవాడలోని తన పెద్దమ్మ వద్దకు వెళ్ళింది.. అయితే అక్కడికి వెళ్లినప్పటికీ కూడా ప్రశాంత్ మృదులను ఫోన్లోనూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన మృదుల విజయవాడ నుంచి సోమవారం రాత్రి 8 గంటలకు సత్తుపల్లి తామర చెరువు వద్దకు చేరుకుంది.. తన పెద్దమ్మ కు ఫోన్ చేసి తాను ఇక బతకనని చెప్పేసింది.. తన ఇద్దరు పిల్లల్లో ఒక కుమారుడి కాలుని తన చున్నీతో కట్టుకొని, మరో కుమారుడిని చేతితో పట్టుకొని నీటిలోకి దిగి ఆత్మహత్య చేసుకుంది.. మృదుల ఫోన్ చేసిన అనంతరం కంగారుపడిన ఆమె పెద్దమ్మ తిరిగి ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తే..అది ఎంతకూ కలవలేదు. ఈ విషయాన్ని ఆమె ప్రశాంత్ కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో అతడు సత్తుపల్లి పట్టణంలో పలుచోట్ల భార్యా పిల్లల కోసం వెతికినా.. వారు కనిపించలేదు. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా తామర చెరువు వద్దకు వెళ్లి వెతికారు.. రాత్రి కావడంతో వారి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే మరుసటి రోజు ఉదయం ముగ్గురి మృతదేహాలు చెరువులో తేలడంతో వాటిని బయటికి తీశారు. మృదుల తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబాన్ని వీధిన పడేసింది

ప్రశాంత్, మృదుల మొదట్లో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఎప్పుడైతే ప్రశాంత్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడటం మొదలుపెట్టాడో అప్పుడే వారి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అప్పటిదాకా ఐదు అంకెల జీతం వచ్చే ప్రశాంత్.. బెట్టింగ్ వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఫీస్ ఇచ్చే టాస్కులు పూర్తి చేయకపోవడంతో అంతంతమాత్రంగా వేతనం వచ్చేది. ఇది కుటుంబ నిర్వహణకు కూడా సరిపోకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అనుకోమని భార్య ఎంత చెప్పినా ప్రశాంత్ వినిపించుకోలేదు. పైగా ఆమెనే కొట్టడం మొదలుపెట్టాడు. భర్త అసలు మారకపోవడంతో చివరికి చావే శరణ్యం అనుకోని మృదుల తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడం కంటతడి పెట్టిస్తోంది. తాను చనిపోతే తన ఇద్దరు పిల్లలు ఆగం అవుతారనే బాధతో మృదుల అంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం అందర్నీ కలచివేస్తోంది.