Karimnagar :  కాలువలో పడేసినా.. అభినవ కర్ణుడిలా బతికి బయటకు వచ్చిన బాలుని కథ

ఎక్కడ పుట్టాడో తెలియదు.. ఎవరు కన్నారో తెలియదు.. తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన బిడ్డ.. కాలువలో కనిపించాడు. మహాభారతంలో కుంతి కదా కర్ణుడిని కని పారేసినట్లుగా బాలుడిని ఓ కవర్లో కట్టి కాలువ గట్టున విసిరేశారు. పుట్టి 24 గంటలైనా కాకముందే అనాథ అయ్యాడు. అయినప్పటికీ.. అభినవ కర్ణుడిలా ఆ నవజాత శిశువు బతికి బయటపడ్డాడు. లోకంపోకడకు సవాల్ విసిరాడు.

Written By: Chai Muchhata, Updated On : September 14, 2024 2:56 pm

Karimnagar

Follow us on

Karimnagar :    అది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ రూరల్ పరిధిలోని తుమ్మనపల్లి గ్రామం. మధ్యాహ్నం 12 గంటలు అవుతోంది. ఆ సమయంలో తన ట్రాక్టర్‌ను కడిగేందుకు అదే గ్రామానికి చెందిన గుండేటి చొక్కారెడ్డి అక్కడున్న ర్యాంపు ద్వారా కాలువలోకి దిగాడు. ట్రాక్టర్ ఇంజిన్ ఆఫ్ చేయగానే పిల్లాడు ఏడుస్తున్న సౌండ్ వినిపించింది. అక్కడ.. ఇక్కడ అంతా వెతికాడు. కానీ.. పిల్లాడు కనిపించలేదు. ఏడుపు మాత్రం లానే వినిపిస్తోంది. చివరకు కాలువ లైనింగ్ మధ్యలోకి వెళ్లి చూశాడు. అక్కడ చిన్నచెట్టు కొమ్మకు తట్టుకొని ఉన్న సంచిపై అతనికి అనుమానం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా.. తల కూడా కనిపించకుండా గుడ్డతో చుట్టి ఆ బాలుడు కనిపించాడు. వెంటనే చొక్కారెడ్డి ఈ విషయాన్ని మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీల దృష్టికి తీసుకెళ్లాడు. వారు సీఐకి సమాచారం అందించారు. సీఐ వెంటనే బాలుడిని హుజురాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు.

ఆ మగ శిశువు 24 గంటల క్రితమే పుట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే.. శిశువు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కరీంనగర్ మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బట్టలో చుట్టి బలవంతంగా పడేసినప్పటికీ బాలుడు చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. దాంతో అందరూ అతడిని మృత్యుంజయుడిగా కొనయాడడం కనిపించింది. శిశువుకు ఊపిరాడకూడదనే తలను కూడా కనిపించకుండా పూర్తిగా గుడ్డలో చుట్టం కనిపించింది. అదే సమయంలో ఆ ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికి వెళ్లడం.. బాలుడి ఏడుపును గుర్తించడం.. ఆ తరువాత ఆస్పత్రికి తరలించడం వెంటవెంటనే జరిగిపోయాయి.

అయితే.. బాలుడిని ప్రత్యక్షంగా చంపాలంటే మనసు రాకనే.. అలా బట్టలో చుట్టి కాలువలో పడేశారని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. ఒకవేళ బాలుడిని గుర్తించడంలో ఆలస్యం జరిగితే ప్రాణాలు పోయేవని.. ఈ ఘటనకు పాల్పడిన వారిపై ఫైర్ అవ్వడం కనిపించింది. అది కరీంనగర్-వరంగల్ హైవే కావడంతో ఆ రూట్‌లో వెళ్లే వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నిత్యం బిజీగా ఉండే రహదారిపై ఎవరు అంతగా పట్టించుకునే పరిస్థితి ఉండదని.. అందుకే బాలుడిని ఈజీగా వదులుకోవచ్చని అనుకున్నట్లు ఉన్నారు. మొత్తానికి మహాభారతంలోని కర్ణుడి ఉదంతాన్ని ఈ ఘటన గుర్తుచేసింది.