Cyber Fraud Prevention: జేబుకు తెలియకుండా పర్స్ కొట్టేయడం అంత ఈజీ కాదు. కానీ నేటి సాంకేతిక కాలంలో.. అసలు పర్స్ కు తెలియకుండానే డబ్బులు కొట్టేస్తున్నారు. ఇటువంటి కంత్రి గాళ్లు మరెవరో కాదు సైబర్ మోసగాళ్లు . మనదేశంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. స్మార్ట్ కాలంలో.. కేవలం స్మార్ట్ పరికరాలు చుట్టూ మనిషి జీవితం పరిభ్రమిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల కోట్లల్లో నగదును బాధితులు కోల్పోతున్నారు.
ఓ నివేదిక ప్రకారం మనదేశంలో సైబర్ మోసాల వల్ల ప్రతి ఏడాది దాదాపు వందల కోట్లు బాధితులు నష్టపోతున్నట్టు తెలుస్తోంది. అయితే సైబర్ నేరాల నియంత్రణకు కేంద్రం నుంచి మొదలు పెడితే రాష్ట్ర ప్రభుత్వాల వరకు విస్తృతంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రత్యేకంగా పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నాయి. అయినప్పటికీ విలువైన సమయంలో బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో.. సైబర్ నేరగాళ్లు ఆ డబ్బులు మొత్తం దర్జాగా దారి మళ్ళి ఇస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో.. అప్పటికే డబ్బు చేతులు మారడంతో.. వాటిని రికవరీ చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారుతుంది.
అందువల్లే గోల్డెన్ అవర్ పీరియడ్లో బాధితులు గనుక తమకు ఫిర్యాదు చేస్తే కచ్చితంగా వారు నష్టపోయిన డబ్బును రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ పోలీసులు కొత్త కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటిని ప్రజలు ఉపయోగించాలని అవగాహన కల్పిస్తున్నారు. పోలీసుల సంగతి అలా ఉంచితే ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ నగరానికి చెందిన 17 సంవత్సరాల అర్జున్ రామ్ అనే యువకుడు సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఏకంగా సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశాడు. దీనివల్ల ముందుగానే సైబర్ మోసాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయడానికి అవకాశం ఉంటుందని అతడు చెబుతున్నాడు..
అర్జున్ రామ్ స్కాం సెక్యూర్ వన్ అనే పేరుతో ఒక వెబ్సైట్ డెవలప్ చేశాడు. ఇది అనుమానాస్పదమైన లింకులు.. సందేశాలను వెంటనే విశ్లేషిస్తుంది. వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనివల్ల సైబర్ మోసగాళ్లు మోసం చేయడానికి ఆస్కారం ఉండదు. అంతేకాదు ప్రజలు అప్రమత్తం కావడం వల్ల మోసపోవడానికి అవకాశం ఉండదు. దీనికి ఇప్పటికే కేంద్ర సైబర్ క్రైమ్ విభాగం ఆమోదం తెలిపింది. త్వరలోనే దీనిని దేశవ్యాప్తంగా వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉంది. అర్జున్ రామ్ తీసుకొచ్చిన ఈ ఆవిష్కరణ పట్ల ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. అతని ప్రతిభకు ఇది గొప్ప గుర్తింపు అని ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు చెబుతున్నారు.
