spot_img
Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీWhatsApp: భారతీయుల వినియోగదారులకు షాకిచ్చిన వాట్సాప్‌!

WhatsApp: భారతీయుల వినియోగదారులకు షాకిచ్చిన వాట్సాప్‌!

WhatsApp: భారతీయుల ఖాతాలపై వాట్సాప్‌ యాజమాన్యం కొరడా ఝళిపించింది. నకిలీ అకౌంట్లు పెరిగిపోతుండడంతో నియంత్రణ విభాగం పెద్ద ఎత్తున అకౌంట్లపై నిషేధం విధిస్తూ వస్తోంది. తాజాగా మార్చి నెలలో భారతీయులకు చెందిన 47 లక్షలకుపైగా ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్‌ వెల్లడించింది.

ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా..
ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్, మెటాకు చెందిన వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో ఏకంగా 47 లక్షల భారతీయులకు చెందిన వాట్సాప్‌ అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), డేటా సైంటిస్టులు, సాంకేతిక విభాగం అందించిన రిపోర్ట్స్‌ ఆధారంగా ఈ చర్యలు తీసుకుంది వాట్సాప్‌ యాజమాన్యం. ఇంకొన్ని ఖాతాలపై యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. తాజాగా వాట్సాప్‌ విడుదల చేసిన యూజర్‌ సేఫ్టీ రిపోర్ట్‌లో దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించింది. ఇప్పుడు నిషేధానికి గురైన వాట్సాప్‌ అకౌంట్లు అన్నీ.. భారతీయ ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్నట్లు గుర్తించినట్లు వివరించింది.

4,720 ఖాతాలపై ఫిర్యాదులు..
ఇక వాట్సాప్‌ సేఫ్టీ రిపోర్ట్‌ ప్రకారం.. 4,720 అకౌంట్లపై ఫిర్యాదులు వచ్చాయి. అందులో 4316 ఖాతాలను నిషేధించాలని యూజర్లు కోరారు. పరిశీలన చేపట్టిన వాట్సాప్‌.. ఇందులో 533 ఖాతాలపై మాత్రమే చర్యలు చేపట్టినట్లు వివరించింది. ఇంకొన్ని యూజర్ల వాట్సాప్‌ అకౌంట్లపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ.. వారికి వ్యతిరేకంగా, ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సదరు ఫిర్యాదు దారులు.. ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని వాట్సాప్‌ వెల్లడించింది. దీంతోనే ఆయా ఖాతాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది.

ఏఐ సహకారం..
వాట్సాప్‌ నుంచి ఎలాంటి అసభ్యకర సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయం తీసుకొని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది వాట్సాప్‌. ఈ టెక్నాలజీని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. కొన్ని సంవత్సరాలుగా యూజర్ల భద్రత కోసం.. ఏఐ, అధునాతన సాంకేతికత, డేటా సైంటిస్టులు, నిపుణుల కోసం ఎంతో ఖర్చు చేస్తున్నట్లు వివరించిన వాట్సాప్‌.. ఐటీ చట్టం 2021లోని నిబంధనల ప్రకారం.. నెలవారీగా సేఫ్టీ రిపోర్ట్స్‌ను విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇందులో యూజర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందాయి.. ఖాతాలపై నిషేధం ఎలా తీసుకున్నాం.. వంటి అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది వాట్సాప్‌.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version