India First Hydrogen Train: భారతీయ రైల్వే చరిత్రలో పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక సరికొత్త విప్లవం మొదలైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తొలి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలును (India’s First Hydrogen Train)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి శుక్రవారం ఉదయం 11:30 గంటలకు అధికారికంగా ప్రారంభించారు. హర్యానాలోని జింద్ – సోనీపట్ మధ్య గల 89 కిలోమీటర్ల మార్గంలో ఉత్తర రైల్వే పరిధిలో ఒక ప్రయోగాత్మక (పైలట్) ప్రాజెక్టుగా ఈ సరికొత్త రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది? దీని విశేషాలేంటీళ?
హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది?
ఈ రైలు నడవడానికి సాధారణ డీజిల్ లేదా ఓవర్హెడ్ విద్యుత్ లైన్ల అవసరం లేదు. ఇందులో ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ (PEM) ఫ్యూయల్ సెల్ సాంకేతికతను ఉపయోగించారు. రైలులోని హై ప్రెషర్ సిలిండర్లలో నిల్వ ఉంచిన హైడ్రోజన్, వాతావరణంలోని ఆక్సిజన్తో రసాయనిక చర్య జరపడం ద్వారా నేరుగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ విద్యుత్ సాయంతోనే రైలు మోటార్లు నడుస్తాయి. ఈ ప్రక్రియలో ఎలాంటి మంట కానీ, పొగ కానీ రాదు. కేవలం నీటి ఆవిరి వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా బయటకు వస్తాయి. అందువల్ల దీనిని ‘జీరో-ఎమిషన్’ రైలుగా పిలుస్తారు.
10 కోచ్ల సామర్థ్యంతో..
ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, చైనా వంటి కొన్ని దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు ఉన్నప్పటికీ, అవి సాధారణంగా 2 నుంచి 4 కోచ్లతో మాత్రమే నడుస్తాయి. కానీ భారత రైల్వే ఏకంగా 10 కోచ్ల సామర్థ్యంతో (2 డ్రైవింగ్ పవర్ కార్లు + 8 ప్యాసింజర్ కోచ్లు) ఈ రైలును రూపొందించింది. ఇందులో ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులు వెళ్లొచ్చు. ఈ రకమైన భారీ సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ ప్యాసింజర్ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటిగా రికార్డు సృష్టించింది.
గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగం:
జింద్ – సోనీపట్ మార్గంలో ఈ రైలు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే దీని డిజైన్ వేగం గంటకు 110 కిలోమీటర్లుగా ఉంది. ఈ 89 కిలోమీటర్ల ప్రయాణంలో జింద్ సిటీ, పాండు పిండారా, లలిత్ ఖేరా, భంభేవా, గోహనా, మోహనతో సహా మొత్తం 12 ఇంటర్మీడియట్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతూ ప్రయాణికులకు సేవలందిస్తుంది.
అత్యంత సురక్షితమైన మల్టీ-లేయర్ సేఫ్టీ సిస్టమ్:
హైడ్రోజన్ చాలా తేలికైన మరియు మండే స్వభావం గల గ్యాస్ కావడంతో, ఈ రైలులో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీని కోసం ప్రత్యేకంగా మల్టీ-లేయర్ సేఫ్టీ సిస్టమ్స్ అమర్చారు. రైలులో ఎక్కడైనా స్వల్పంగా హైడ్రోజన్ లీకేజ్ జరిగినా వెంటనే గుర్తించే లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్టర్లు, హీట్ అండ్ స్మోక్ సెన్సార్లు ఉన్నాయి. ఏదైనా అసాధారణ పరిస్థితి తలెత్తితే సిస్టమ్ ఆటోమేటిక్ గా హైడ్రోజన్ సరఫరాను నిలిపివేస్తుంది. అలాగే, బ్యాకప్ కోసం లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను కూడా అమర్చారు.
దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ప్లాంట్:
ఈ ప్రాజెక్టు కోసం కేవలం రైలును మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి హైడ్రోజన్ రైల్వే ఎకో-సిస్టమ్ను భారత్ అభివృద్ధి చేసింది. హర్యానాలోని జింద్లో దేశంలోనే అతిపెద్ద రైల్వే హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే నీటి నుండి విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా గ్రీన్ హైడ్రోజన్ను తయారు చేసి, ప్రెషరైజ్డ్ ట్యాంకర్లలో నిల్వ చేసి, రైలులోని రెండు పవర్ కార్లకు ఒకేసారి సమాంతరంగా ఇంధనాన్ని నింపుతారు.
