Old Smartphones Data Center: ఎకరాలకు ఎకరాలు భూమి కావాలి. దండిగా నీళ్లు కావాలి.. కరెంటు.. ఎటువంటి ప్రకృతి విపత్తులు చోటుచేసుకోని ప్రాంతం.. ఇలా అన్ని అనుకూలంగా ఉంటేనే ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా డేటా సెంటర్ వల్ల నీటి వినియోగం కూడా అధికంగా ఉంటుంది. దీనికి తోడు ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా డేటా సెంటర్ల మీద రకరకాల విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు డేటా సెంటర్లకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
డేటా సెంటర్ల మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి పెరిగిపోతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. డేటా సెంటర్లు ఎక్కువగా పనిచేయాల్సి వస్తోంది. దీనివల్ల వాటి మీద ఒత్తిడి విపరీతంగా ఉంటున్నది. కరెంట్ వినియోగం.. వేడిమి పెరిగిపోవడం.. వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భవిష్యత్తు కాలంలో ఇలానే జరిగిపోతూ ఉంటాయి. వేరే విధమైన ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.. అందువల్లే డేటా సెంటర్ల విషయంలో గూగుల్ ముందుగానే మేల్కొంది.
మానవ అతీత మేథ ఆధారంగా పనిచేసే సమాచార కేంద్రాల మీద భారం తగ్గించడానికి గూగుల్ సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ఏకంగా పాత స్మార్ట్ ఫోన్లతో వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా పాత ఫోన్లో సహాయంతో ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. హై ప్రాసెసింగ్ పవర్ అవసరం లేకుండానే టాస్క్ లు వీటి ద్వారా చేయవచ్చని గూగుల్ నిపుణులు చెబుతున్నారు.
పాత ఫోన్ లలో ఉన్న మదర్ బోర్డులను అనుసంధానం చేయడం ద్వారా దీనిని ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది గనుక విజయవంతం అయితే.. పాత స్మార్ట్ ఫోన్ల ద్వారానే సమాచార కేంద్రాలను నిర్వహించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది. నీటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది. భూమి లభ్యత ఎక్కువగా లేకున్నా పర్వాలేదు. దీనికి తోడు ఉష్ణోగ్రత చాలావరకు తగ్గుతుంది. పైగా పర్యావరణం మీద ప్రతికూల ఫలితాలు అంతగా ఉండవు.
ఈ ప్రయోగాన్ని ఇటీవల గూగుల్ మొదలుపెట్టింది. ఇది చివరి దశలో ఉంది. ఇంకా కొన్ని దశలు మిగిలి ఉన్నాయి. అవి పూర్తి అయితే.. ఇచ్చిన టాస్కులు విజయవంతంగా పూర్తి చేయగలిగితే అప్పుడు గూగుల్ ఈ పాత ఫోన్ల ద్వారా తన సమాచార కేంద్రాలను ఏర్పాటును మొదలుపెడుతుంది. అయితే ఇది జరగడానికి ఇంకా కొంతకాలం పడుతుంది.
