Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీJapan: జపానా మజాకా.. 6 గంటలో అద్భుతం చేశారు!

Japan: జపానా మజాకా.. 6 గంటలో అద్భుతం చేశారు!

Japan: ప్రపంచంలోనే తొలిసారిగా జపాన్‌(Japan)లోని ఓ నిర్మాణ సంస్థ 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతను(3D Printing Technology) ఉపయోగించి కేవలం ఆరు గంటల్లో రైల్వే స్టేషన్‌ను నిర్మించి సరికొత్త రికార్డు సృష్టించింది. వేగవంతమైన నిర్మాణం, సమయ ఆదా, కార్మిక కొరతను అధిగమించే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు అంతర్జాతీయంగా దష్టిని ఆకర్షించింది. వెస్ట్‌ జపాన్‌ రైల్వే కంపెనీ ఆధ్వర్యంలో సెరెండిక్స్‌ సంస్థ ఈ ఘనతను సాధించింది.

Also Read ‘హరి హర వీరమల్లు’ సరికొత్త పోస్టర్ విడుదల..రూమర్స్ కి చెక్ పెట్టిన టీం!

చిన్న అడుగు, గొప్ప ఆవిష్కరణ
వాకాయామా ప్రాంతంలోని అరిడా నగరంలో ఉన్న హట్సుషిమా రైల్వే స్టేషన్‌(Railway Station)లో ఈ అద్భుతం జరిగింది. ఈ స్టేషన్‌ పరిమాణంలో చిన్నదైనప్పటికీ, దీని నిర్మాణ ప్రక్రియ భవిష్యత్‌ రైల్వే మౌలిక సదుపాయాలకు ఒక కొత్త దిశను చూపింది. స్టేషన్‌ విస్తీర్ణం కేవలం 108 చదరపు అడుగులు (సుమారు 10 చదరపు మీటర్లు). ఎత్తు 2.6 మీటర్లు, వెడల్పు 6.3 మీటర్లు, లోతు 2.1 మీటర్లతో ఈ నిర్మాణం రూపుదిద్దుకుంది. ఈ స్టేషన్‌ బయటి భాగంలో అరిడా ప్రాంతానికి ప్రసిద్ధమైన నారింజ పండ్లు, కట్‌లాస్‌ ఫిష్‌ డిజైన్లను చెక్కారు. ఈ స్థానిక లక్షణాలు స్టేషన్‌కు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి. స్టేషన్‌ లోపలి భాగం గాలి ఆడేలా ఓపెన్‌ స్పేస్‌తో, సీటింగ్‌ ఏరియాతో రూపొందించారు.

3డీ ప్రింటింగ్‌తో వేగవంతమైన నిర్మాణం
సంప్రదాయ నిర్మాణ పద్ధతుల్లో రైల్వే స్టేషన్‌ నిర్మాణానికి రెండు నెలలకు పైగా సమయం, భారీ ఖర్చు అవసరం. అయితే, 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతతో ఈ ప్రక్రియను సెరెండిక్స్‌ సంస్థ కేవలం ఆరు గంటల్లో పూర్తి చేసింది. కొమామోటోలోని ఒక ఫ్యాక్టరీలో స్టేషన్‌ భాగాలను 3డీ ప్రింటింగ్‌ ద్వారా తయారు చేశారు. ఈ భాగాలను మోర్టార్‌తో ప్రింట్‌ చేసి, రీఇన్‌ఫోరŠస్డ్‌ కాంక్రీట్, స్టీల్‌తో బలోపేతం చేశారు. రాత్రి 11:57 గంటలకు చివరి రైలు బయలుదేరిన వెంటనే కార్మికులు పని ప్రారంభించారు. పాత చెక్క నిర్మాణాన్ని తొలగించి, క్రేన్‌ సాయంతో 3డీ–ప్రింటెడ్‌ భాగాలను ఒకదానితో ఒకటి అనుసంధానించారు. ఉదయం 5:45 గంటలకు తొలి రైలు వచ్చే సమయానికి స్టేషన్‌ నిర్మాణం సిద్ధమైంది. ఈ వేగవంతమైన ప్రక్రియ సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఖర్చును సగానికి తగ్గించింది.

కార్మిక కొరతకు 3డీ సాంకేతికత ఒక పరిష్కారం
జపాన్‌లో వృద్ధాప్య జనాభా(Old age Papulation) కారణంగా కార్మిక కొరత తీవ్ర సమస్యగా మారింది. 2070 నాటికి దేశ జనాభాలో 40% మంది 65 ఏళ్లు పైబడిన వారు ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో 3డీ ప్రింటింగ్‌ సాంకేతికత కార్మిక ఆధారిత నిర్మాణాలను తగ్గించి, వేగవంతమైన, ఖర్చు–తక్కువ పరిష్కారాలను అందిస్తోంది. ఈ సాంకేతికతతో నిర్మాణ సమయం, శ్రమ గణనీయంగా తగ్గడమే కాకుండా, డిజైన్‌లో సౌలభ్యం, పర్యావరణ అనుకూలత కూడా సాధ్యమవుతోంది. సంప్రదాయ పద్ధతుల్లో ఫార్మ్‌వర్క్‌ అవసరమైన చోట, 3డీ ప్రింటింగ్‌ దాన్ని తొలగించి, సంక్లిష్ట ఆకారాలను సులభంగా సృష్టించగలదు. ఇది వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్‌ చేస్తూ, నిర్మాణ వ్యర్థాలను తగ్గిస్తుంది.

జులైలో పూర్తిస్థాయి ప్రారంభం
ప్రస్తుతం స్టేషన్‌ భవనం నిర్మాణం పూర్తైనప్పటికీ, ఇంటీరియర్‌ పనులు, టికెట్‌ యంత్రాలు, ట్రాన్స్‌పోర్టేషన్‌ కార్డ్‌ రీడర్లు వంటి సౌకర్యాల ఏర్పాటు ఇంకా జరగాల్సి ఉంది. ఈ పనులు పూర్తయిన తర్వాత, 2025 జులైలో ఈ స్టేషన్‌ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

భవిష్యత్‌కు ఒక ఆదర్శం
హట్సుషిమా స్టేషన్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో, వెస్ట్‌ జపాన్‌ రైల్వే కంపెనీ ఇలాంటి 3డీ ప్రింటెడ్‌ స్టేషన్‌లను ఇతర ప్రాంతాల్లోనూ నిర్మించాలని ప్లాన్‌ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య చెక్క నిర్మాణాలను ఈ సాంకేతికతతో భర్తీ చేయడం ద్వారా రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ఖర్చు–ప్రభావం, దీర్ఘకాల నిర్వహణ అంశాలను కూడా పరిశీలిస్తోంది. ఈ 3డీ ప్రింటెడ్‌ స్టేషన్‌ కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు.. ఇది సాంకేతిక ఆవిష్కరణ, సమయ ఆదా, స్థిరమైన అభివృద్ధికి ఒక ప్రతీక. జపాన్‌ ఈ సాంకేతికతతో రైల్వే రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది, ఇది ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది.

Also Read: కొత్త రేషన్‌ కార్డు స్టేటస్‌.. ఇంటి నుంచే తెలుసుకోండి.. ఒక్క క్లిక్‌తో వివరాలు!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular