AI Job Losses: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఆర్థిక మాంద్యం.. ఇంకా అనేక రకాల పరిణామాలు ప్రపంచ జాబ్ మార్కెట్ మొత్తాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో అన్ని రంగాలలో ఉన్న ఉద్యోగులను పక్కన పెడుతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ నిరాటంకంగా సాగిపోతోంది. భారీ స్థాయిలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఏడాదికి కోట్లల్లో ప్యాకేజీలు తీసుకునే వారు కూడా భయపడిపోతున్నారు. జాబ్ గ్యారంటీ లేక దినదిన గండంగా జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ సులేమాన్ హెచ్చరికలు ఇప్పుడు ఐటి ఇండస్ట్రీని మరింత భయపెడుతున్నాయి.
సులేమాన్ చెప్పిన మాటల ప్రకారం వచ్చే 12 నుంచి 18 నెలల్లో వైట్ కాలర్ విభాగంలో చాలావరకు ఉద్యోగాలు కాలగర్భంలో కలిసిపోతాయని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా అకౌంటింగ్, లీగల్ వర్క్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, మార్కెటింగ్ వంటి రంగాలలో పనిచేసే వారంతా ఉద్యోగాలు కోల్పోతారని తెలుస్తోంది. కంప్యూటర్ల ముందు కూర్చొని చేసే ఉద్యోగాలు మొత్తం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా భర్తీ అవుతాయని సులేమాన్ హెచ్చరిస్తున్నారు.
మనుషుల స్థాయిని ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అందుకుంటున్న నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మార్కెటింగ్, అకౌంటింగ్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ వంటి కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలు కాలగర్భంలో కలిసిపోతాయని సులేమాన్ హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఈ విభాగాలలో 15 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇంకా తొలగింపుల ప్రక్రియ నిత్యం కొనసాగుతూ ఉంటుందని పేరు మోసిన ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే ఈ విభాగాలలో పని చేసేవారు వేరే మార్గాలు చూసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
