Pastor Abhinaya Darshan Attack: ఏపీలో ఆ మధ్య రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల దారుణమైన స్థితిలో చనిపోయారు.. ఆయన మరణాన్ని చాలామంది హత్య అని పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తేలింది. పైగా ఆయన మద్యం కూడా తాగారని.. ఆ మత్తులోనే రోడ్డు ప్రమాదానికి గురై ఉంటారని ఏపీ పోలీసులు ప్రకటించారు. ప్రవీణ్ పగడాల మరణాన్ని కొంతమంది తమ రాజకీయానికి అనుకూలంగా మార్చుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తోందని.. ఆరోపించారు. చివరికి పోలీసులు విచారణ జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రవీణ్ కేసును మర్చిపోకముందే ఇప్పుడు ఏపీలో మరో పాస్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాస్టర్ మీద దాడి జరిగింది. గూడెం కొత్త వీధి మండలం మొండిగడ్డ పంచాయతీ నీరు తోటపాలెం దగ్గర ఓ పాస్టర్ మీద ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడికి గురైన పాస్టర్ పేరు అభినయ దర్శన్.. ఇతడు భరోసా పేరుతో ఒక పార్టీ పెట్టారు. కొద్దిరోజులుగా మన్యం ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు. పర్యటన ముగించుకొని మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆయన కారులో వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు ఆయన మీద దాడి చేశారు. ఈ ఘటనలో అభినయ దర్శన్ తీవ్రంగా గాయపడ్డారు.
పార్టీ పేరుతో అన్యమత ప్రచారం చేస్తున్నారని ఆ గుర్తు తెలియని వ్యక్తులు అభినయ దర్శన్ తో గొడవపడ్డారు. మొదట ఆయన వాహనం మీద గుడ్లు విసిరేశారు. ఆ తర్వాత కత్తులు.. ఇతర ఆయుధలతో అతని మీద దాడి చేశారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కిరణ్ జార్జ్, సుదర్శన్ అనే వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. పాస్టర్ అభినయ్ మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. గాయాల తాకిడికి ఆయన రోడ్డు పక్కన పడిపోయారు.. ప్రస్తుత వీరంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాము ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చామని.. మమ్మల్ని దాడి చేసి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉందని ప్రశ్నించారు. ఈ ఘటన తర్వాత జిల్లా ఎస్పీ అమిత్ సంఘటన స్థలానికి వెళ్లారు. స్థానిక పోలీసులనుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకోడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు తనలో పాస్టర్ ప్రవీణ్ మాదిరిగానే చంపడానికి కొంతమంది వ్యక్తులు వచ్చారని.. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని అభినయ దర్శన్ పేర్కొన్నారు. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది.
