AI Chip Crisis: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ప్రపంచాన్ని ఎంత వేగంగా మారుస్తోందో.. అంతకంతకూ వినియోగదారులపై ఆర్థిక భారాన్ని కూడా మోపుతోంది. ప్రస్తుతం గ్లోబల్ టెక్ మార్కెట్లో తలెత్తిన సరికొత్త సంక్షోభం కారణంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్ల ధరలు భారీగా పెరగనున్నాయని ప్రముఖ అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థలు Gartner, TrendForceలు హెచ్చరిస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ విపరీతమైన వాడకమేనని టెక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదెలా అంటే?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక AI కోడింగ్ ఏజెంట్లను రన్ చేయడానికి టెక్ కంపెనీలకు భారీ ఎత్తున ‘AI డేటా సెంటర్లు’ అవసరమవుతున్నాయి. ఈ డేటా సెంటర్లలోని సూపర్ కంప్యూటర్లు సజావుగా పనిచేయాలంటే అత్యంత వేగవంతమైన హై బ్యాండ్విడ్త్ మెమొరీ (HBM), సర్వర్-గ్రేడ్ DRAM, NAND ఫ్లాష్ స్టోరేజ్ చిప్లు అవసరం. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఉత్పత్తి అవుతున్న మొత్తం మెమొరీ చిప్లలో సుమారు 70 శాతం వరకు ఈ AI డేటా సెంటర్ల కోసమే కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి.
సాధారణంగా మొబైల్స్, ల్యాప్టాప్లు కోసం చిప్ లను తయారు చేసే శాంసంగ్ , ఎస్కే హైనిక్స్ , మైక్రాన్ వంటి దిగ్గజ సంస్థలు.. ఇప్పుడు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే AI సర్వర్ చిప్ల తయారీ వైపు తమ ప్లాంట్లను మళ్లించాయి. దీనివల్ల మనం రోజువారీగా వాడే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, గేమింగ్ ప్లేస్టేషన్లకు అవసరమైన ర్యామ్ , రోమ్ చిప్ల కొరత తీవ్రమైంది. ఇదే సమయంలో వీటికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో కేవలం కొద్ది నెలల్లోనే మెమొరీ చిప్స్ కాంట్రాక్ట్ ధరలు 90% నుండి 130% పైగా పెరిగాయి.
ఇప్పటివరకు పెరిగిన అదనపు తయారీ ఖర్చులను మొబైల్, ల్యాప్టాప్ బ్రాండ్లే భరిస్తూ వచ్చాయి. కానీ, ఈ విపరీతమైన చిప్స్ ధరల భారంతో ఇకపై తాము ఏమీ చేయలేమని కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. ఇటీవలే యాపిల్ , హెచ్పీ వంటి గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ.. మెమొరీ చిప్స్ ధరల పెరుగుదల వల్ల తమ ఉత్పత్తుల ధరలను పెంచడం అనివార్యం అని స్పష్టం చేశారు. గతంలో ఒక ల్యాప్టాప్ తయారీ ఖర్చులో మెమొరీ చిప్ల వాటా 15% మాత్రమే ఉండగా, ఇప్పుడది ఏకంగా 35% కి చేరింది. ఫలితంగా ల్యాప్టాప్లు, మ్యాక్బుక్ల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 15% నుండి 35% వరకు పెరగడం మొదలైంది.
టెక్ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ధరల పెరుగుదల ప్రభావం ప్రీమియం మొబైల్స్/ల్యాప్టాప్ల కంటే బడ్జెట్ ఫ్రెండ్లీ డివైజ్లపైనే ఎక్కువగా ఉండనుంది. ధరలు విపరీతంగా పెరగడం వల్ల కంపెనీలు తక్కువ మార్జిన్ ఉండే బడ్జెట్ ఫోన్లను, ల్యాప్టాప్లను తయారు చేయడం తగ్గించవచ్చు. దీనివల్ల రాబోయే రోజుల్లో మార్కెట్లో సాధారణ డివైజ్ల లభ్యత తగ్గిపోనుంది. వినియోగదారులు కూడా కొత్త ఫోన్లు, ల్యాప్టాప్లు కొనడానికి బదులు.. పాత వాటినే ఎక్కువ కాలం వాడటానికో లేదా సెకండ్ హ్యాండ్/రిఫర్బిష్డ్ మోడళ్లను ఆశ్రయించడానికో మొగ్గు చూపే అవకాశం ఉంది.
