AP Employees Strike: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం గట్టెక్కించింది. సమ్మెకు దిగుదామనుకున్న వారి ప్రయత్నాన్ని విరమింపజేసింది. వారు కోరుకున్న కొన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని చెబుతూ.. మరికొన్నింటి వాటిపై బుజ్జగించింది. ఒక దశలో నిరసన చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకునే స్థాయిలో వెళ్లినా వారి ఆందోళనను కట్టడి చేసింది. ఉద్యోగ సంఘాల నాయకులు సైతం ప్రభుత్వం చెప్పిన సూచనలకు అంగీకరించారు. ప్రస్తుతానికి సమ్మెను చేసేది లేదని, వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని మీడియా సంస్థలకు సమ్మె లేకపోవడం మింగుడు పడడం లేనట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం పోయిందనే బాధలో ఉన్నారు..!!
సీఎం జగన్ గతంలో చేసిన పాదయాత్రలో ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో సరైన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్నా పీఆర్సీపై ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే ఉద్యోగులు తరుపున కొన్ని మీడియా సంస్థలు పీఆర్సీపై అదే పనిగా కథనాలు వినిపించాయి. దీంతో చాలా మంది ఉద్యోగుల్లో పీఆర్సీ సాధించుకోవాలన్న భావన కలిగింది. ఈ నేపథ్యంలో వారు పీఆర్సీపై ఆందోళన చేయాలనుకున్న సమయంలో సదరు మీడియా సంస్థలకు పంట పండినట్లయింది.
ఇక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇరుకున పెడుతామాని వేచి చూస్తున్న వారికి ఇది పండుగ లాంటి వార్తలాగా దొరికింది. ఇంకేముంది..? మిగతా వార్తలను పక్కనబెట్టయినా సరే ఉద్యోగులకు సంబంధించిన కథనాలు వరుసగా వెలువరించాయి. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులతో డిబేట్లు నిర్వహించిన వారిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాయి. ప్రభుత్వంపై ఎలా తిరగబడాలో పరోక్షంగా వారికి చెప్పినట్లయింది. వాస్తవానికి ఉద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించుకునేందుకే శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నారు. కానీ కొందరు ఉద్యోగులు మాత్రం ఆవేశాన్ని కట్టలు తెంచుకున్నారు. మరి వారి ఆవేశానికి కారణమైన మీడియా సంస్థలేవో అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో చీలిక మొదలైంది. లేని పోని కథనాలు ప్రసారం చేస్తూ ఉద్యోగుల్లోనే విభేదాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఉద్యోగులు నిరసన తీవ్రమైన కొద్దీ సదరు మీడియా సంస్థలకు మంచి సరుకు దొరుకుతుందని భావించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ఇదే సమయమని భావించారు. ఇక ఉద్యోగులు సమ్మెను ప్రకటించడంతో ఆ మీడియా సంస్థలు సైతం రకరకాల కథనాలు వెలువరించేందుకు రెడీ అయ్యాయి. ఇక ప్రభుత్వం పడిపోయింది.. అన్నట్లుగా ప్రచారం చేశాయి.
కానీ సీఎం జగన్ చాకచక్యంగా వ్యవహరించి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించారు. అయితే ఇక్కడ కూడా ఆ మీడియా సంస్థలు తమకనుగుణంగా ప్రచారం చేసుకున్నాయి. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గిందని, ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రచారం చేశారు. అయితే ప్రభుత్వం సీఎం అన్నాకా.. ఒక్కోసారి కొన్ని పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగుల ఆందోళనను చల్లార్చేందుకు చర్యలు తీసుకున్నారు. వారితో చర్చలు జరిపేందుకు ప్రత్యేకంగా మంత్రుల కమిటీ వేసి సమస్యను పరిష్కరించారు.
అయితే ఆ మీడియా సంస్థలు ఇప్పుడు నిరాశ చెందుతున్నాయి. ఒకవేళ ఉద్యోగులు కనుక సమ్మెుకు దిగితే ప్రభుత్వ కార్యాకలాపాలు ఆగిపోతాయి. రాష్ట్ర పాలన స్తంభించిపోతుంది. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు రావు. మొత్తంగా రాష్ట్రంలో అల్లకల్లోల వాతావరణం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని హైలెట్ చేయడానికి ఆ మీడియా సంస్థలు రెడీ అయ్యాయి. కానీ.. డామిడ్.. కథ అడ్డం తిరిగింది..!! ఉద్యోగులు సమ్మెను చేయడం లేదని ప్రకటించడం వారికి మింగుడు పడడం లేదు. అయినా మీడియా సంస్థలు ఊరుకోవడం లేదు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలపై విరుచుకుపడుతున్నాయి. ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లాయని ప్రచారం చేస్తున్నాయి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More