Ishan Kishan: టీ 20 ఫార్మాట్ లో ఇటీవల సంచలనాలు సృష్టించాడు ఇషాన్ కిషన్ . ముఖ్యంగా న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. ఒక సెంచరీ, మరొక హాఫ్ సెంచరీ తో పెను విధ్వంసం సృష్టించాడు. ఇషాన్ కిషన్ దూకుడుగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో అతడికి టి20 వరల్డ్ కప్ లో అవకాశం కల్పించారు. ప్రస్తుతం అతడు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
ఇషాన్ కిషన్ అంతకంటే ముందు డొమెస్టిక్ క్రికెట్ లో సంచలనం సృష్టించాడు. ఏకంగా జార్ఖండ్ జట్టును విజేతగా నిలిపాడు. సారధిగా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్ మ్యాచ్లో విధ్వంసం సృష్టించాడు..ఆ తరహాలో ఆడినప్పటికీ కూడా అతడికి జట్టులో చోటు అంత ఈజీగా లభించలేదు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ గాయపడిన నేపథ్యంలో అతడి స్థానంలో న్యూజిలాండ్ సిరీస్ కు కిషన్ ను ఎంపిక చేశారు.
న్యూజిలాండ్ సిరీస్ ద్వారా వచ్చిన అవకాశాన్ని కిషన్ వినియోగించుకున్నాడు. మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. పరుగుల వరద పారించాడు. సాధారణంగా టి20 తరఫున అభిషేక్ శర్మ ఊర మాస్ ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. కానీ అతడిని మించిపోయాడు కిషన్. విధ్వంసం అంటే ఎలా ఉంటుందో.. పరాక్రమం అంటే ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించాడు. అందువల్లే టి20లలో అతడు కింగ్ మేకర్ అయ్యాడు.
ఆ స్థాయిలో ఆడుతున్న కిషన్ విషయంలో ఇప్పటికి మేనేజ్మెంట్ ఆగ్రహం గానే ఉందా? గతంలో కోపాన్ని ఇంకా తగ్గించుకోలేదా? ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానాలు లభిస్తున్నాయి. దేశవాళి క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో కిషన్ కు టి20 వరల్డ్ కప్ లో చోటు లభించింది. అయితే అతడికి సెంట్రల్ కాంట్రాక్టు విషయంలో బిసిసిఐ అంత గొప్పగా దయ చూపలేదు. తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో అందరికీ చోటు దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అతడికి ఇంకా కొంతకాలం సమయం ఉందని.. అప్పటి వరకు ఎదురు చూడక తప్పదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. గతంలో రంజీలలో ఆడకుండా రెస్ట్ తీసుకోవడం.. డొమెస్టిక్ క్రికెట్ మొత్తాన్ని నిర్లక్ష్యం చేయడంతో 2023 24 సీజన్ సెంట్రల్ కాంట్రాక్టులో కిషన్ తో పాటు అయ్యర్ కూడా చోటు కోల్పోయాడు. తాజా జాబితాలో అయ్యర్ కు గ్రేడ్ బీ లో చోటు లభించింది..